ప్రజాశక్తి – గుంటూరు లీగల్ : విజయవాడ రామవరప్పాడుకు చెందిన కుర్ర శివ నాగభూషణం తన సొంత మామ వెలగపూడి సాంబశివరావును హతమర్చిన కేసులో శివనాగభూషణంకు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ గుంటూరు రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వై.నాగరాజా సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మృతుడు సాంబశివరావుకు ఇద్దరు కుమార్తెలు. గుంటూరు కాకుమానివారితోటలోని సూర్య హనుమాన్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె వాణిని విజయవాడ రామవరపాడుకు చెందిన తన సొంత మేనల్లుడైన కుర్ర శివ నాగభూషణంతో 20 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. నాగభూషణం తాగుడు, ఇతర వ్యసనాలకు లోనై తన సొంత ఆస్తిని పోగొట్టుకొని భార్య వాణిని హింసించేవాడు. వీటిని భరించలేక వాణి తన పుట్టింటికి వచ్చి విడాకుల కోసం గుంటూరు ఫ్యామిలీ కోర్టులో అప్లరు చేశారు. విడాకులు వస్తే భార్య ఆస్తి తనకు రాదని కక్షపెంచుకున్న నాగభూషణం ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. 2017 జులై 30వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో గుంటూరులో తన మామ, భార్య వాణి ఉంటున్న సూర్య హనుమాన్ అపార్ట్మెంట్కు వచ్చి వాణిని అసభ్యకర పదజాలంతో తిడుతూ కత్తితో దాడి చేయగా ఆమె తన చేతులు అడ్డుపెట్టడంతో చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడేందుకు తండి సాంబశివరావు అడ్డు వెళ్లగా అయన్నూ నాగభూషణం కత్తితో పొడిచి పరారయ్యాడు. సాంబశివరావును తొలుత గుంటూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో, తర్వాత విజయవాడలోని ఆయుష్ హాస్పటల్కు తరలించారు. అయితే 10 రోజుల తర్వాత ఆయన మరణించాడు. దీనిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సిఐ ఎం.శ్రీకాంత్ బాబు విచారణ చేయగా కోర్టులో ఛార్జిషీట్ను సిఐ కె.వంశీధర్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో పైమేరకు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
