ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పొగాకు వేలం కేంద్రంను పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ గురువారం సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిల్లి తిప్పారెడ్డి పొగాకు రైతులతో కలిసి ఆమెను కలిశారు. పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను ఈడి విశ్వశ్రీ దష్టికి తీసుకువెళ్లారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే కోలుకోవడం కష్టతరమని తెలియజేశారు. గత ఏడాది సగటు రూ.250 ఉండగా ఈ ఏడాది తగ్గిందన్నారు. ఇలాగైతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 18 మంది కంపెనీల ప్రతినిధులు పొగాకు కొనుగోలుకు రావాల్సి ఉండగా కేవలం 9 మంది మాత్రమే వస్తున్నారని, దీంతో పోటీ లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు గిట్టుబాటు ధర ఇవ్వకుండా చేస్తూ రైతులను నష్టపోయేలా చేస్తున్నారన్నారు. గ్రేడ్ వన్ పొగాకును మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతూ గిట్టుబాటు ధర మాత్రం కల్పించడం లేదన్నారు. ఇకలో గ్రేడ్ పొగాకును అసలు కొనుగోలు చేయడం లేదని రైతులు వేలం కేంద్రానికి తీసుకురావడం ఇంటికి తిరిగి తీసుకువెళ్లడం ఇదే తంతు కొనసాగుతోందని ఆమె దష్టికి తీసుకువచ్చారు. 40 శాతం మాత్రమే గ్రేడ్ వన్ పొగాకు పండిందని మిగిలిన 60 శాతం లోగ్రేడ్ వచ్చిందని తెలిపారు. స్పందించిన ఈడి విశ్వశ్రీ రైతులకు న్యాయం జరిగేలా గిట్టుబాటు ధర కల్పించేలా, లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. కంపెనీల ప్రతినిధులు, రైతులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు సెక్రటరీ డి.వేణుగోపాల్, కనిగిరి వేలంకేంద్రం ఆక్షన్ సూపరిండెంట్ బి.కోటేశ్వరరావు, రైతులు ఆరికట్ల బ్రహ్మయ్య, ఎన్ మాలకొండయ్య, కుందూరు రవీంద్ర, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
