మదార్సాహెబ్ను సత్కరిస్తున్న ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి
ప్రజాశక్తి – మాచర్ల : మాచర్ల మున్సిపల్ ఇన్ఛార్జి చైర్మన్గా 27వ వార్డు కౌన్సిలర్ షేక్ మధార్ సాహెబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎక్స్అఫిషియో సభ్యుడిగా హజరైన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జి చైర్మన్ పోలూరి నరసింహారావు రాజీనామాతో వైస్చైర్మన్గా ఉన్న మధార్ సాహెబ్ను ఇన్ఛార్జి చైర్మన్గా కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. మధార్ సాహెబ్ను నియోజకవర్గ పరిధిలోని టిడిపి నాయకులు, అధికారులు, స్నేహితులు, బంధువులు సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమమే టిడిపి ధ్యేయమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు మస్లిములను, ముగ్గురు వైశ్యులను మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నుకున్న ఘనత టిడిపికి దక్కుతుందని చెప్పారు. ముస్లిముల అభ్యున్నతికి సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, గతంలో రద్దు చేసిన అనేక సంక్షేమ పథకాలను పునరుద్ధరించారని చెప్పారు. 2024 ఎన్నికల హామీలో భాగంగా మధార్ను చైర్మన్ చేస్తానని హామీ ఇచ్చామని గుర్తు చేశారు.
రూ. 9 కోట్ల అప్పుతీర్చి పాలనను గాడిలో పెట్టాం
గత వైసిపి పాలనలో మాచర్ల మున్సిపాలిటీ రూ.12 కోట్ల అప్పుల్లో కూరుకుపోయి, పాలన గాడి తప్పిందని, గడిచిన 10 నెలలో దాదాపు రూ.9 కోట్ల అప్పులు తీర్చి, పాలనను గాడిలో పెట్టామని ఎమ్మెల్యే వివరించారు. ఇంకా రావాల్సిన బకాయిలను తక్షణమే వసూలు చేసి, మిగిలిన అప్పులు కూడా తీర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఆదాయ వనరులు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. పట్టణ పరిధిలో దాదాపు రూ.3 కోట్లతో పట్టణ రోడ్లను ఆధునీకరిస్తున్నామని, ఇంకా మిగిలిన రోడ్లకు రూ.11 కోట్ల నిధులు అవసరమని తెలిపారు. నగరాన్ని ఆధునీకరించేందుకు అవసరమైన క్లినింగ్ యంత్రాలను కూడా కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, అధికారులు పాల్గొన్నారు.
