ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని మడికి గ్రామ టిడిపి అధ్యక్షుడు దొండపాటి సుబ్బరాజు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ శ్రేణులతో సోమవారం కొత్తపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కలసి వెళ్లి బండారు సత్యానందరావుకు ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుబ్బరాజు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో కొన్ని ప్రధాన రోడ్లు అధ్వాన్నంగా మారాయని వాటి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావును కోరడం జరిగిందన్నారు. ఈ మేరకు నాయకుల అభ్యర్థనపై స్పందించిన ఎమ్మెల్యే బండారు ఇటీవల మడికి గ్రామంలో పర్యటించి రోడ్ల దుస్థితిని పరిశీలించారన్నారు. మడికి కృష్ణ మందిర్ రావి చెట్టు వద్ద నుండి చిలకలపాడు మీదుగా గాంధీనగరం వరకు రోడ్లు అభివృద్ధికి సుమారు రూ. 1.14 కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేయించారన్నారు. గడిచిన ఐదేళ్లుగా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, పత్రికల్లో పలు కథనాలు వెలువడిన గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ మేరకు మడికి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బండారుకు గ్రామస్తుల ఆనందాన్ని వివరిస్తూ నాయకులంతా అభినందనలు తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పాలూరి బుల్లబ్బాయి, మండల టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు చెల్లబోయిన సింహాచలం, టిడిపి సీనియర్ నాయకులు అడ్డాల రాజు, పంపన అంజిబాబు, ఈదల రమేష్, కొత్తపల్లి కృష్ణ, మల్యాల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
