ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జరగనున్న రాష్ట్ర ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో ప్రవేశ పెట్టిన వాట్సప్ గవర్నెన్స్, శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పటిష్టంగా జరిగేలా మునిసిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు ప్రత్యేక దష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియా, సంబంధిత శాఖల జిల్లా అధికారు లతో అవగాహన కార్యక్రమాలు, జాతీయ ఉపాధి హామీ పధకం అమలు, జి.ఎస్.డబ్ల్యు.ఎస్ సర్వీసెస్, మిస్సింగ్ సిటిజన్స్ మ్యాపింగ్, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య ఏర్పాట్లు వంటి అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, మునిసిపల్ కమి షనర్లు, ఎంపిడిఓలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో ప్రవేశ పెట్టిన వాట్సప్ గవర్నెన్స్, శక్తి యాప్ అవగాహన కార్యక్రమాలు ఈ నెల 15 నుంచి సచివా లయాల పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవ గాహన ప్రక్రియ క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేయడం, ప్రభుత్వం రుపొందించిన బ్రోచర్ను ప్రజలకు అందచేయడంతో పాటు వారి మొబైల్ ఫోన్లో సంబంధిత యాప్లు డౌన్లోడ్ చేయాలన్నారు. ఈ అవగాహన ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు పని దినాలు కల్పించేలా క్షేత్ర స్థాయిలో ఎంపిడిఓలు, ఎపిఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆదివారం జిల్లాలో పిడుగుపాటు వలన ఇద్దరు విద్యార్ధులు మరణించడం భాదకరమని, వర్షాకాలంలో ముఖ్యంగా మెరుపులు, పిడుగులు పడే అవకాశం వున్న సమయంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వీడియో సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డ్వామా పిడి జోసఫ్ కుమార్, డిపిఓ వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీ బాల శంకర రావు పాల్గొనగా, క్షేత్రస్థాయి నుంచి మునిసిపల్ కమీషనర్లు, డిఎల్.డి.ఓలు, ఎంపిడిఓలు, ఈఓపిఆర్డిలు, ఎపిఓలు పాల్గొన్నారు.
