పార్వతీపురం టౌన్ : ఒడిస్సా నుంచి తమిళనాడుకు 44 కేజీల గంజాయి ప్యాకెట్లను కారులో రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సిఐ కె.మురళీధర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తు సమాచారం మేరకు శనివారం ఉదయం పట్టణ ఎస్ఐ గోవింద తన సిబ్బందితో కలిసి రాయగడ రోడ్ చివర ఉన్న పెట్రోల్ బంకు వద్ద ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో డ్రైవర్తో సహా ఐదుగురు వ్యక్తులు ఉన్న కారు రాగా, క్లూస్ టీం ఆ కారును తనిఖీ చేసిందన్నారు. ఆ కారులో 44 కేజీలు గల 22 గంజాయి ప్యాకెట్ల దొరికాయని, వీటి విలువ సుమారుగా రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. అప్పటికే తమిళనాడుకు చెందిన సురేష్ కృష్ణ, మణికందన్ గోపాలకృష్ణ, విజయమురగన్, పొన్నప్పన్, మణికందన్ యలయత్తం, జయరాం పెరుమాళ్ పారిపోవడానికి ప్రయత్నించగా పోలీస్ సిబ్బంది సాయంతో ముద్దాయిలను పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. కారును, గంజాయిని స్వాధీనపర్చుకున్నామన్నారు.
