ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: మే 20న చేపట్టే కార్మిక, కర్షక సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగునాయుడు పిలుపునిచ్చారు. గుమ్మలక్ష్మీపురం మండలం సవరకోటపాడు గ్రామంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి మూడోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులకు, గిరిజనులకు, కార్మికులకు తీవ్ర నష్టం చేకూర్చే విధానాలను అవలంబిస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానాల వల్ల రోజురోజుకూ ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. దేశ ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయ రంగం పూర్తిగా దివాలా తీస్తుందని, రైతులు పండించే పంటలకు మద్దతుధర కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛని వినియోగించుకునేందుకు, సంఘాలు పెట్టుకునేందుకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం హరిస్తున్నదని మండిపడ్డారు. అందులో భాగంగా 48 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని ధ్వజమెత్తారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సి ఉన్నప్పటికీ గత ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా కార్మికులకు జీతభత్యాల్లో పెరుగుదల లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి పూర్తిగా నాశనం చేయడం వల్ల సామాన్యులకు నిత్యావసర సరుకులు కూడా అందుబాటులోకి లేకుండా పోతున్నాయని చెప్పారు. ఈ సమస్యలన్నిటిపై దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు, గిరిజన సంఘాలు ఐక్యంగా మే 20న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాగ్రహాన్ని ఈ సార్వత్రిక సమ్మె జయప్రదం చేయడం ద్వారా తెలియజేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి బి.వి.రమణ, గిరిజన సంఘం నాయకులు మండంగి రమణ మాట్లాడారు. సమావేశంలో సిఐటియు నాయకులు ఎన్వై నాయుడు, కె.సాంబమూర్తి, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఆడిట్, బిడ్డిక అనిల్, శంకర్రావు, సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.లేబర్ కోడ్లు రద్దుకు పోరాటంసాలూరు రూరల్ : కార్మిక వర్గానికి నష్టం చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మద్దతిచ్చింది. బుధవారం జరిగిన ఫెడరేషన్ సమావేశంలో సమ్మె ప్రచారపత్రాలను నాయకులు విడుదల చేశారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.రాముడు, టి.శంకర్రావు మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో ఇప్పటికే నిధులు లేక కార్మిక వర్గానికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ నిలిచిపోయాయని తెలిపారు. సబ్బులు, చెప్పులు, నూనెలు, పనిముట్లు తదితర వస్తువులను ఏళ్ల తరబడి ఇవ్వడం లేదన్నారు. వెంటనే స్థానిక సమస్యలను పరిష్కరించకుంటే మే 20వ తేది తరువాత నిరవధిక సమ్మెకు వెళ్తామని, దానికి పాలకవర్గాలదే బాధ్యతని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు జలగడుగుల హరిబాబు, టి.లక్ష్మి, కె.రాముడు, శ్రీను పాల్గొన్నారు.
