ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలి

Apr 26,2025 21:15

కురుపాం: జమ్మూ- కాశ్మీర్‌ పహాల్గామాలో 28 మంది పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు డిమాండ్‌ చేశారు. మండలంలో దురిబిలిలో శనివారం సిపిఎం నాయకులతో కలిసి ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశమంతా కులాలకు, మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంలో కలిసి మెలిసి ఉండడాన్ని చూసి ఓర్వలేక ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం అన్యాయమని, ఇది కేవలం పర్యాటకులే కాకుండా భారతీయులందరిపై దాడి చేశారని, కావున యావత్‌ భారతీయులంతా ఐక్యంగా ఉగ్రవాద దాడులను ఖండించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రంగంలోకి తీసుకొచ్చిన మార్పుల వల్ల ఇలాంటి సంఘటనలో జరగడానికి ఒక రకమైన కారణమన్నారు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పార్వతీపురం: కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా యుటిఎఫ్‌ ఆధ్వర్యాన స్థానిక ఏరియా ఆసుపత్రి జంక్షన్‌ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వరకు కొవ్వొత్తులతో ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారికి ఉపాధ్యాయులు ఘన నివాళి అర్పిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కరరావు, జిల్లా సహధ్యక్షులు వి.జ్యోతి, కోశాధికారి కె.మురళి, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బి.జగన్నాథం, వి.వసంతనాయుడు, పట్టణ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డి.పోలినాయుడు, కె.గోవిందరావు, కొమరాడ, పార్వతీ పురం, జియ్యమ్మవలస మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.పాలకొండ : ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతిగా స్థానిక స్టేట్‌ బ్యాంకు నుంచి కోట దుర్గ ఆలయం వరకు మాజీ సైనిక ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శేఖర్‌, పూర్వపాధ్యక్షులు దుప్పాడ పాపినాయుడు తదితరులు ఉన్నారు.పార్వతీపురంటౌన్‌ : ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక కలెక్టరేట్‌ నుంచి చర్చివీధి జంక్షన్‌ వరకు సాగింది. అనంతరం ఉగ్రదాడుల్లో మృతి చెందిన వారికి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

➡️