పాలకొండ : తోటపల్లి ఆయకట్టు రైతుల సమస్యలపై ఈనెల 6న తలపెట్టిన ధర్నాలో రైతులంతా పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు, అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు, రైతు ప్రతినిధి నరసింగపాణి గ్రహి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం వారు ఓని, లుంబురు, కోటిపల్లి, విపిరాజుపేట తదితర గ్రామాల రైతులతో మాట్లాడారు. సుమారు 8500 ఎకరాలకు తోటపల్లి ఆయకట్టు భూములకు అనేక ఏళ్లుగా సాగునీరందడం లేదని, ఎందువల్ల అని అడిగితే కాలువలు మరమ్మతులని అధికారులు చెబుతున్నారని, ఇలా ఎంత కాలం? ఎందుకు మరమ్మతులు చేపట్టడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కేటాయించింది రూ.47 కోట్లని, ఈ నిధులు ఉద్యోగుల జీతాలకే సరిపోవడంలేదని, ఇక పని ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ ఏడాది కాలువ మరమ్మతుల పనులు ప్రారంభించలేదని, దీంతో నీరు అందించే పరిస్థితి లేదన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయరా అంటూ ప్రభుత్వం ప్రశ్నించారు. ఇందుకు రైతులంతా కలిసి రావాలన్నారు. 15 మంది లాస్కర్లకు ఇద్దరే ఉన్నా ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. పెద్దపుటి వద్ద సైఫాన్ పాడైనా మరమ్మతులు చేపట్టలేదన్నారు. రైతులు కదిలితే అన్ని పనులు జరుగుతాయని, ఇందుకు వంశధార, తోటపల్లి నిర్వాసిత రైతులే రుజువు చేశారని అన్నారు. ఈ సమస్యలపై మంగళవారం సబ్కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ధర్నాకు ముందస్తుగా స్థానిక దుర్గ గుడి వద్దకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
