ప్రజాశక్తి-సీతానగరం : ఉపాధి హామీ కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన బుధవారం చినబోగిలి సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా అధ్యక్షులు రెడ్డి ఈశ్వరరావు మాట్లాడుతూ మండలంలో జనవరి నెల నుంచి 12 వారాల పాటు పనులు చేశారని, కానీ నేటికీ వేతనాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. చేసిన పనికి 14 రోజుల్లో కూలి చెల్లించాలని చట్టంలో నిబంధన ఉన్నప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ఉపాధి హామీకి కేటాయించిన నిధులను ఇతర పథకాలకు దారి మళ్లించవద్దని డిమాండ్చేశారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోవడం వల్ల కూలీలకు పనులు తగ్గిపోయాయని తెలిపారు. సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి, రోజు కూలి 600 రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. పని ప్రాంతంలో తాగునీరు, నీడ, మందులు, వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేట్లకు పారితోషం చెల్లించాలని, ఫొటో మస్తర్ వేయడానికి సెల్ఫోన్లు పంపిణీ చేయాలని కోరారు. రెండో పూట పని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యకాస మండల అధ్యక్షులు సిహెచ్ కృష్ణ, ఉపాధి కూలీలు ఎం.లక్ష్మణరావు, చుక్క గణేష్, రామినాయుడు, పార్వతి, రామలక్ష్మి, చిన్నమ్మలు తదితరులు పాల్గొన్నారు.
