ప్రజాశక్తి- సీతానగరం : జానావాసాల మధ్య ఏనుగుల జోన్ పెట్టవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు. మండలంలోని అప్పయ్యపేట వద్ద ఫారెస్ట్ అధికారులు చేపట్టిన కందకాల తవ్వకాల పనులను నిలుపుదల చేయాలని స్థానికులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రేపటివలస రెవెన్యూ పరిధిలో గల అప్పయ్యపేట గ్రామం వద్ద ఏనుగుల జోన్ పేరుతో ఫారెస్ట్ అధికారులు కందకాలను తవ్వడం ఆపాలన్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్వాకంతో అప్పయ్యపేట, రేపటివలస తామరకండీ, పులుగుమ్మీ, గుచ్చిమి, సీతారాంపురం, జోగంపేట గ్రామాల ప్రజలతో పాటు మండల ప్రజలు కూడా పెనుముప్పు పొంచి ఉందని, అధికారులు తక్షణమే పనులు నిలుపుదల చేయాలని లేదంటే ఈ కొండ చుట్టూ గల గ్రామాల ప్రజలను కూడగట్టి భవిష్యత్తు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు, స్థానికులతో అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి వేణు, మండల నాయకులు రెడ్డి ఈశ్వరరావు, గవర వెంకటరమణ, ఆర్.రాము, వై. రామారావు, స్థానికులు కె.అప్పారావు, వై.రాంబాబు, బి.సోములు, రాము, యస్.పరమేశు, కస్తూరి సత్తెమ్మ, పుష్పమ్మ, కురసాని, తదితరులు పాల్గొన్నారు.
