గృహ లక్ష్యాలు పూర్తి కావాలి

May 9,2025 20:38

ప్రజాశక్తి-పార్వతీపురం : ఈ నెలాఖరు నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలు పూర్తి కావాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోబిక అధికారులకు స్పష్టం చేశారు. వివిధ శాఖల పనుల ప్రగతిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహ నిర్మాణ దశలు త్వరగా మారుటకు సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల గృహాల్లోనూ అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదని, వాటి పట్ల శ్రద్ధ వహించాలని చెప్పారు. జన్‌మాన్‌ పథకంలో ఇంకా 3098 గృహాలు ప్రారంభం కావాల్సి ఉండటాన్ని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని, ఉపాధి హామీ కింద పంట గుంతలు (ఫారం పాండ్లు) తవ్వడం పట్ల దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాలో 11450 పంట గుంతలు తవ్వాలని లక్ష్యం నిర్దేశించామని, ఇప్పటికే 9087 మంజూరు చేయగా, 2900 పూర్తి అయ్యాయని తెలిపారు. వేతనదారుల్లో 15 నుంచి 20 శాతం మందిని పంట గుంతల తవ్వకాలకు మళ్లించాలని సూచించారు. వారికి సరాసరి వేతనంగా రూ. 270 నుండి 290 వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో కనీసం ఐదు చెరువులను అమృత్‌ సరోవర్‌ చెరువులుగా మలచుటకు గుర్తించాలన్నారు. ఉపాధి హామీ కింద 4500 ఎకరాల్లో ఉద్యాన పంటలు వేయుటకు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 2146 ఎకరాలు గుర్తించారని, మిగిలిన భూమిని వెంటనే గుర్తించాలని ఆమె ఆదేశించారు. వాటికి అంచనాలు తయారు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గృహ నిర్మాణ సంస్థ ఇన్‌ఛార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.ధర్మ చంద్రా రెడ్డి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.రామ చంద్ర రావు, ఎంపిడిఒలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

➡️