ఇల్లు కట్టకపోతే రద్దు : కలెక్టర్‌

Feb 5,2025 21:25

ప్రజాశక్తి -బలిజిపేట /సీతానగరం : గృహాలు మంజూరైన లబ్ధిదారులు తక్షణం తమ ఇళ్లను నిర్మించుకోవాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. బలిజిపేట మండలంలోని మిర్తివలస, బలిజిపేట గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, గృహ నిర్మాణ లేఔట్లను, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం గృహాలను మంజూరు చేసిందని, ఆ గృహాలను లబ్ధిదారులు తక్షణం నిర్మించుకోవాలన్నారు. ఇంకా నిర్మాణం చేయని గృహాలుంటే వాటిని రద్దుచేసి అవసరమైన లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. లబ్ధిదారులకు అన్ని వివరాలను అవగాహన కలిగించాలని గృహ నిర్మాణ అధికారులను ఆదేశించారు. నిర్మాణాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆదేశించారు. అప్పటికీ నిర్మాణాలు పూర్తి చేసేందుకు ముందుకు రాకపోతే సంబంధిత వివరాలు అందించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్‌ వేతనదారులతో ముఖాముఖి మాట్లాడారు. వేతనదారుల హాజరును పరిశీలించారు. ఫారం పాండ్లను నిర్మించుకొనేందుకు ఆసక్తి చూపించాలని కలెక్టర్‌ కోరారు. వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారి వివరాలు పరిశీలించారు. ఉపాధి హామీ పనులను బాగా చేపట్టి గ్రామాల్లో ఆదర్శంగా నిలవాలని కోరారు. వంద రోజులు పని అందరూ వినియోగించు కోవాలని సూచించారు. మిర్తి వలస చెరువును పరిశీలించి అక్కడ జంగిల్‌ క్లియరెన్స్‌ చేయాలని, వర్షాలు కురిసినప్పుడు గండి పడకుండా గట్లును బలంగా వేయాలని తెలిపారు. సచివాల యంలో రీసర్వే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామ విజ్ఞాన కేంద్రాల్లో పోటీ పరీక్షలకు అనువైన అనేక పుస్తకాలు ఏర్పాటు చేశామని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. మిర్తివలస అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌ విద్యార్థుల బరువు, ఎత్తులను పరిశీలించారు. వారికి అందిస్తున్న పౌష్టికాహార వివరాలను తనిఖీ చేశారు. చిన్నారులకు చక్కటి విద్యా ప్రమాణాలు ఇప్పటి నుండే బోధించాలని సూచించారు. పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్యం మెరుగుకు కృషి చేయాలని ఆదేశించారు. గ్రామంలో ఉన్న గర్భిణీలు, బాలింతల వివరాలను అడిగి తెలుసుకు న్నారు. టేక్‌ హౌమ్‌ రేషన్‌ ప్రతి ఒక్కరికీ అందాలని ఆయన స్పష్టం చేశారు. రక్తహీనత ఏ ఒక్కరికీ ఉండరాదని, గ్రామ సచివాలయ సిబ్బంది మంచి సేవలను అందించాలని ఆదేశించారు. పల్లె పండుగ, పంచాయతీరాజ్‌ పనులను ఫిబ్రవరి మాసాంతానికి పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పనులు చేయడంలో జాప్యం చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరి ంచారు. సీతానగరం మండలం నిడగల్లు లో జరుగుతున్న రహదారి పను లను కలెక్టర్‌ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహంబలిజిపేట మండలంలో పంచాయతీరాజ్‌, గృహ నిర్మాణ శాఖ, పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్తివలసలో గల జగనన్న లేఅవుట్లు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పని తీర ను మార్చుకోకపోతే విధులు నుండి తొలగించి పరిస్థితి వస్తుందని అధికారులను హెచ్చరించారు. అలాగే మండలంలోని పారిశుధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జగనన్న లే అవుట్లో ఇళ్ల నిర్మాణాలు, లేఅవుట్లలో సౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, మండల ప్రత్యేకాధికారి కె.రాబర్ట్‌ పాల్‌, గృహ నిర్మాణ సంస్థ ఇన్చార్జి అధికారి డాక్టర్‌ పి. ధర్మాచంద్రారెడ్డి, బలిజిపేట ఎంపిడిఒ విజయలక్ష్మి, తహశీల్దార్‌ కె.రత్నకుమారి, డిఇ జి,సోమేశ్వరరావు పంచాయతీరాజ్‌ అధికారులు అంబేద్కర్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

➡️