ప్రజాశక్తి – పాలకొండ : ఏ పార్టీ అధికారులోకి వస్తే ఆ పార్టీలోకి నాయకుల కప్పగెంతులు తప్పడంలేదు. స్వలాభం కోసం నాయకులు ఇలా పార్టీలు మార్చడం సాధారణమై పోయింది. ఒక పార్టీనే నమ్ముకొని, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నాయకులు, ప్రజాప్రతినిధులు ఉండేవారు. అయితే గతం కొంత కాలంగా ఇలాంటి నైతికలు విలువలు ఉండడంలేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి నాలుగు రాళ్లు వెనుకోసుకుందామన్న ఉద్దేశమే తప్ప ప్రజా ప్రయోజనాలను పట్టించుకున్న దాఖలాల్లేవన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. పాలకొండ మండల పరిషత్తో పాటు నగర పంచాయతీలో వైసిపికే సంఖ్యాబలం ఉంది. వైసిపి అధికారం కోల్పోవడంతో ఇటీవల కాలంలో ఆ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే ఇక్కడ ప్రాతినిధ్యం వహించడంతో ఆ పార్టీలోకి వలసలు కడుతున్నారు మండల పరిషత్లో 12 మంది సభ్యులుండగా, 10మంది వైసిపి ఎంపిటిసి సభ్యులు, ఇద్దరు టిడిపి సభ్యులు ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో వైసిపికి చెందిన ఎంపిపి బొమ్మలు భానుతో పాటు వైస్ ఎంపిపి అనిల్, మరో ఇద్దరు ఎంపిటిసి సభ్యులు జనసేనలో చేరారు. మరో ఒకరిద్దరూ వచ్చే అవకాశాలు ఉన్నట్టు రాజకీయంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 17మంది వైసిపి కౌన్సిలర్లు ఉండగా, ముగ్గురు టిడిపి సభ్యులు ఉన్నారు. ఎన్నికల ముందే వైసిపి నుంచి నాలుగో వార్డ్ కౌన్సిలర్ కొరికాన గంగు నాయుడు జనసేనలో చేరారు. ఇటీవల కాలంలో వైసిపికి చెందిన 19వ వార్డు కౌన్సిలర్ రాధా కుమారి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో సంఖ్య15కు తగ్గింది. కొద్దిరోజుల క్రితమే రెండో వార్డ్ కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరి టిడిపిలో చేరారు. తాజాగా పదో వార్డ్ కౌన్సిలర్ కొంచాడ అరుణ్ కుమార్ సతీమణి జనసేనలో చేరడంతో కూటమికి మరింత బలం పెరిగిందని చెప్పవచ్చు. వైసిపి నుంచి వలసలు పెరుగుతున్నప్పటికీ ఆ పార్టీ నేతలు ఎందుకు నిలవరించలేకపోతున్నారన్న చర్చ జరుగుతుంది. నగర పంచాయతీలో మరి కొంతమంది నేతలు పార్టీ మారేందుకు ఊగిసలాటలో ఉన్నట్లు తెలుస్తుంది. రానున్న రోజుల్లో పాలకొండ మండల పరిషత్లోనూ, నగరపంచాయతీలో కూటమి పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది.జనసేనలోకి కౌన్సిలర్తో పాటు మరికొంత మంది చేరిక పదో వార్డ్ కౌన్సిలర్ కొంచాడ అరుణ్కుమార్ భార్య సరోజనమ్మతో పాటు మరో 50మంది కార్యకర్తలు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సమక్షంలో శనివారం జనసేనలోకి చేరారు. జనసేన సిద్ధాంతాలతో పాటు ఎమ్మెల్యే జయకృష్ణ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరామన్నారు. వీరికి ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కొంచాడ అరుణ్ కుమార్, ఎంపిపి బొమ్మాలి భాను, వైస్ ఎంపిపి వాకుమూడి అనిల్, ఎంపిటిసి సభ్యులు మజ్జి నవీన్, నాలుగో వార్డ్ కౌన్సిలర్ కొరికాన గంగనాయుడు, టిడిపి మండల నాయకులు జాడ శ్రీధర్, జనసేన నాయకులు జానీ, ప్రశాంత్ కుమార్, రమేష్ తదితరులు ఉన్నారు
