పార్వతీపురం: రాష్ట్ర విద్యాశాఖ అసంబద్ధ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్ రావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట రమేష్, ప్రధాన కార్యదర్శి కె.భాస్కరరావు గురువారం డిఇఒ ఎన్.తిరుపతినాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పని వేళల పెంపు, ఉపాధ్యాయుల సెలవుపై ఆంక్షలు, వందరోజుల కార్యాచరణ ప్రణాళిక, అపార్ నమోదులో జాప్యంపై ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వంటి నిర్ణయాలతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈనెల 11న జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదుట నిరసన, 16న రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. అసంబద్ద నిర్ణయాలు ఉపసంహరించుకోక పోతే ఆందోళనకు సిధ్ధమవుతామని వారు హెచ్చరించారు.