ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని సోమగండి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న కిశోర్ వికాసం వేసవి శిక్షణా తరగతులను ఆర్జెడి చిన్మయిదేవి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 2 నుంచి జూన్ 10 వరకు వేసవి శిక్షణా తరగతులు జరుగుతాయని తెలిపారు. ఇవి పగడ్బందీగా నిర్వహించాలన్నారు. కౌమార దశలో ఉన్న బాలికలకు కిశోర్ వికాసం గురించి వివరించారు. వారికి కావాల్సిన పౌష్టికాహారం గురించి తెలిపారు. కిశోర్ వికాసం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. కౌమార దశలో బాలికలు అవసరాల గురించి తెలిపారు. శిక్షణా తరగతుల్లో ఎర్రకువారిగూడ, అక్కన్న గూడ బాలికలు పాల్గొన్నారు. అలాగే కొత్తూరు, భామిని మండలాల్లో శిక్షణా తరగతులను సందర్శించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి కనకదుర్గ, సిడిపిఒ పి.రంగలక్ష్మి, సూపర్వైజర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.భామిని : బాలికల ఆరోగ్యం పట్ల, పరిశుభ్రతపట్ల ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ చట్టాలు పట్ల, లింగ వివక్ష పట్ల అవగాహన కలిగివుండాలని ఐసిడిఎస్ ఆర్జెడి జి.చిన్మయి దేవి అన్నారు. భామిని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం కిశోర దశ బాలికలకు కిషోర్ వికాసం -వేసవి సెలవులు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌమార దశ బాలికలకు, వ్యక్తిగత శుభ్రత పట్ల, రక్తహీనత పట్ల, బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన పోస్కో చట్టం పట్ల, లింగ వివక్ష పట్ల, విద్యా నైపుణ్యాల అభివద్ధి, ఉన్నత ఆలోచనలు కలిగి ఉండడం, బాల్య వివాహాల గురించి అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకదుర్గ, సీతంపేట సిడిపిఒకనకమహాలక్ష్మి, మహిళా పోలీస్ చందన, భామిని సిడిపిఒ శాంతి భవాని, అంగన్వాడీ సిబ్బంది వరలక్ష్మి, సబిత వున్నారు. కురుపాం : కిశోర బాలికల అభివృద్ధి, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిడిపిఒ పైల జానకమ్మ అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. మండలంలోని మొండెంఖల్, నీలకంఠాపురం పంచాయతీల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రుతుక్రమ పరిశుభ్రత, లైంగిక విద్య, బాల్యవివాహాలు పునరుత్పత్తి ఆరోగ్యం-ప్రభావాలు, పిల్లల హక్కులు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ తదితర కిశోర వికాసంపై వేసవి శిక్షణ అంశాలను గూర్చి అంగన్వాడి సిబ్బందికి అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
