ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం కలిగించాలి

May 10,2025 20:55

ప్రజాశక్తి – పాలకొండ : ప్రభుత్వాసుపత్రిపై నమ్మకం కలిగించేలా మరింత బాధ్యతగా వైద్యాధికారులు, సిబ్బంది పనిచేయాలని స్థానిక ఎమ్మెల్యే, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ నిమ్మక జయకృష్ణ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యాధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రాజకీయ నాయకులుగా తాము కూడా ప్రభుత్వాసుపత్రిలోనే వైద్యానికి వస్తామని, ఆసుపత్రి కూడా నమ్మకం పెరుగుతుందని అన్నారు. ఆక్సిజన్‌ నిల్వలు ఉంచేలా దృష్టి పెట్టాలన్నారు. మహాప్రస్థానం వాహనం అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని, దీనిపై తాను సంబంధిత మంత్రితో మాట్లాడుతానని అన్నారు. ఆసుపత్రిలో రోగులకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. రిఫరల్‌ కేసులు తగ్గేలా చూడాలన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతానికి దగ్గరగా ఉన్న హాస్పటల్‌ కావడంతో పాముకాట్లు ఎక్కువగా ఉన్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఫిజీషియన్‌ ఇక్కడి నుంచి డిప్యూటేషపై వైద్యాధికారి వెళ్లే విషయాన్ని కూడా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడుతానన్నారు. డయాలసిస్‌ కేంద్రంలో 30 బెడ్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ నాగభూషణ మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రూ.2.50కోట్లు ఆసుపత్రి అభివృద్ధి నిధులు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు అడపా బాబ్జీ, అనుపుజవ రాజు, ఎస్‌.సరస్వతి, పి రాజశేఖర్‌, ఎచ్చెర్ల జయరాం, నగర పంచాయతీ చైర్మన్‌ ఆకుల మల్లేశ్వరి, వైస్‌ ఎంపిపి వాకుమూడి అనిల్‌, తూర్పు కాపు రాష్ట్ర డైరెక్టర్‌ గర్భాన సత్తిబాబు, ఆసుపత్రి కమిటీ మాజీ చైర్మన్‌ వెన్న శ్రీనివాసరావు, ఎంపిపి ప్రతినిధి సుధా, ఆకుల కుమార్‌, సుందరరావు తదితరులు ఉన్నారు.

➡️