ప్రజాశక్తి – కురుపాం: జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఈ నెల 2న పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో జరిగిన సమీక్ష సమావేశంలో పంచాయతీ కార్యదర్శులపై జిల్లా జాయింట్ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ జె.ఉమామహేశ్వరికి జేసీ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ పంచాయతీ కార్యద ర్శుల సంఘం మండల అధ్యక్షులు వై.వెంకటనాయుడు ఆధ్వర్య ంలో కార్యదర్శులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ సచివాల యాల పర్యవేక్షణపై ఉన్న అధికారాలపై స్పష్టత వచ్చే వరకు తమకు కేటాయించిన క్లస్టర్ పరిధిలో సంబంధించిన విధులు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఎం. ధనుంజయ, బి.చంటి, ఆనంద్ పాల్గొన్నారు. వీరఘట్టం: జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభిక ఈ నెల 2న పంచాయతీ కార్యదర్శులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఎఒ డి.వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ప్రతి సర్వేలో సచివాలయ కార్యదర్శులు, డిజిటల్ సహాయకులు, మహిళా పోలీసులు తప్ప మిగిలిన శాఖకు సంబంధించిన అధికా రులు సర్వేలు చేయడంలేదని, పని చేసే వారిని కించపర్చేలా మాట్లాడడం సరికాదని వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో బంగారు బాబు, కోటేశ్వరరావు, చక్రధర్, అప్పలరాజు, రాంబాబు, శివ, పాల్గొన్నారు.కొమరాడ :జాయింట్ కలెక్టర్ వ్యాఖ్యలపై మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ఎంపిడిఒ ఎం.మల్లికార్జునరావుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధికారుల నుండి గ్రామ సచివాలయాల పర్యవేక్షణపై ఉన్న అధికారాలపై స్పష్టత వచ్చే వరకు గ్రామపంచాయతీ విధులు, సచివాలయ పరిధిలో తమకు కేటాయించిన క్లస్టర్ పరిధిలోని పనులు మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్న కార్యదర్శులపై ఉన్నత అధికారులు ఒత్తిళ్లు చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. వ్యక్తిగతంగా దూషించడం, మాట్లాడడంపై ఉద్యోగులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
