కురుపాం: పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ శనివారం పార్వతీపురంలోని కలెక్టరేట్లో ప్రశంసాపత్రాలు అందజేసి, అభినందించారు. ఇందులో భాగంగా స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మర్రాపు రిషిత 591 మార్కులు సాధించి జిల్లాలో జెడ్పి హైస్కూళ్లలో ప్రథమ స్థానం, జిల్లాలో ద్వితీయ స్థానం సాధించినందుకు గానూ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సత్కరించారు. రిషితతో పాటు హెచ్ఎం తోట శంకరరావును కూడా సత్కరించారు. కార్యక్రమంలో ఇంచార్జి డిఇఒ రమాజ్యోతి, ఎస్ఎస్ ఎపిసి ఆర్. తేజేశ్వరరావు, విశ్రాంత డిఇఒ ఎన్.తిరుపతి నాయుడు, ఉప విద్యాశాఖాధికారులు, ఎంఇఒలు, ప్రిన్సిపాళ్లు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.సాలూరు రూరల్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు మరడ గాయత్రి (588), మరడాన భావన (584), చొంగల వర్షిణి (583)ను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మూకల పెంటయ్య పాల్గొన్నారు. వీరఘట్టం : మండలంలోని రేగులపాడు కెజిబివి పాఠశాలకు చెందిన జి.నందిని (582), ఎం.శ్రీవిద్య( 575) పదో తరగతి ఫలితాల్లో ప్రతిభా చాటారు. వీరిని జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేసి ఆశీర్వదించారు. అలాగే ప్రిన్సిపల్ ఉషారత్న కుమారిని కూడా అభినందించారు. గరుగుబిల్లి: స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కాలేజీకి చెందిన వి.త్రివేణి (567)ని, ప్రిన్సిపల్ ఎస్.సంధ్యారాణిని జిల్లా కలెక్టర్ అభినందించారు.
