ప్రజాశక్తి – పార్వతీపురం : జిల్లాలో జీడి పప్పు ప్రాసెసింగ్కు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్వతీపురం, వీరఘట్టంలలో గిడ్డంగులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవచ్చని సూచించారు. సాలూరు, గుమ్మలక్ష్మీ పురం, కురుపాంలలో ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. అందుకు అవసరమగు యంత్ర పరికరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రాసెసింగ్ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని ఆదేశించారు. గోనె సంచులు కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రాసెసింగ్ కేంద్రాల వద్ద అవసరమగు పరికరాలు, సిబ్బంది, సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. ప్రాసెసింగ్ కేంద్రాలకు అవసరమైన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సీతంపేట ప్రాంతంలో ఇప్పటికే ప్రాసెసింగ్ జరుగుతుందని, వీటి ఆధారంగా లైసెన్సు తదితర అంశాలను కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు. డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ వై సత్యం నాయుడు మాట్లాడుతూ గుమ్మలక్ష్మీ పురం, సాలూరు, మక్కువలో రెండు చొప్పున ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్లు ప్రస్తుతానికి ఉన్నాయని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు పిఒ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.
