ఉపాధి హామీ లాగిన్‌ నిలిపివేత పై నిరసన

May 5,2025 21:23

ప్రజాశక్తి – మక్కువ : మండలంలోని ఎ.వెంకంపేటలో ఉపాధి హామీ మేట్ల లాగిన్‌ నిలిపివేతపై మేట్లు, కూలీలు ఆగ్రహంతో ఊగిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా మేట్లును మార్చుతున్నారని, అందువల్లే తమకు లాగిన్‌ ఇవ్వకుండా ఓ ఇద్దరికి మాత్రమే లాగిన్‌ ఇచ్చి మిగతా 12 గ్రూపుల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయాన్ని ముట్టడించారు. టిడిపి నాయకులు కూలీలతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగు ట్రాక్టర్లతో ఎ.వెంకంపేటలోని కూలీలంతా మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక ఎంపిటిసి దొడ్డి సాయిబాబా, మేట్లు పెంట పార్వతి, దొడ్డి అనూరాధ, దొడ్డి శ్రీధర్‌ తదితరుల ఆధ్వర్యంలో నిరసన జరిగింది. సెల్‌ఫోన్‌ పరిజ్ఞానం లేని,60 ఏళ్లు ఓ ఇద్దరు మేట్లును లాగిన్‌ ఇచ్చి మిగిలిన 12 గ్రూపులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ ఇద్దరి వ్యక్తులకే లాగిన్‌ ఇవ్వడం వల్ల వారు రాజకీయం చేస్తున్నారని, వెంటనే వారి లాగిన్‌ తొలగించాలని కూలీలు డిమాండ్‌ చేశారు.రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తా : ఎంపిడిఒఇంతవరకు గ్రామంలో ఇలాంటి సమస్య ఉందని తనకు తెలియదని, వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన వారందర్నీ మేట్లుగా నియామకం చేపట్టి లాగిన్‌ వచ్చేలా చూస్తానని ఎంపిడిఒ డిడి స్వరూపరాణి కూలీలకు తెలిపారు. ఎంపిటిసి సాయిబాబా సమక్షంలోనే ఉపాధి హామీ సిబ్బంది ఎపిఒ ఈశ్వరమ్మ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ శంకర్రావు, ఇసి వెంకటలక్ష్మితో మాట్లాడి పూర్తి వివరాలు తమకు అందజేయాలని ఎంపిడిఒ ఆదేశించారు. అలాగే ఏ విధమైన అర్హత లేకుండా తమపై పెద్దరికం చేస్తున్న ఇద్దరు మేట్లకు కూడా లాగిన్‌ తొలగించాలని ఈ సందర్భంగా కూలీలు ఎంపిడిఒను కోరారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఎస్సై వెంకటరమణ, సిబ్బంది పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

➡️