కురుపాం: పచ్చని పొలాలు… కళ్లాల్లో పండిన పంటలు… తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల ఆప్యాయతా అనురాగాలు.. ఉన్నంతలో కలిసిమెలిసి సాగే జీవనం.. ఒక్కమాటలో చెప్పాలంటే పల్లెలోగిలికి కుటుంబమే ఆభరణం.. ఇదీ మన పల్లె ఖ్యాతి.. కానీ పల్లెల్లో ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వీధుల్లో తాళం వేసిన ఇళ్లు… చెట్ల కింద వృద్దుల నిరీక్షణ.. ఏవైనా పండగలు వస్తే తప్ప పల్లెల్లో కళ లేకుండా పోయింది. సొంతూరిని, కన్నవారిని కలుసుకొనేలా ‘సంక్రాంతి పండగ తెచ్చింది. పిల్లలంతా బతుకు తెరువుకు పట్టణాలకు పోతే ఇంటి వద్ద నిరీక్షిస్తున్న ముసలి ప్రాణాలకు మళ్లీ వీరి రాకతో గ్రామాల్లో ప్రేమబంధాలు వెల్లివిరుస్తున్నాయి. గ్రామాల్లో చేసేందుకు పనిలేక పొట్టకూటి కోసం ఊరు విడిచి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికులు సంక్రాంతి పండగకు సొంత గూటికి చేరుకుంటున్నారు. వలసలు పోవడంతో నిన్నటి వరకు జనసంచారమే లేక గ్రామాల్లో ఇళ్లకు తాళాలు వేసి బోసి పోయిన గ్రామాలు నేడు జనంతో సందడిగా కనిపిస్తున్నాయి. వలసలతో ఆత్మీయ బంధాలతో పాటు బాల్యం కనుమరుగై పోగా అక్కున చేర్చుకునే అలనా, పాలనా కరువై అష్టకష్టాలుపడుతున్న చిన్నారులకు మరో పది రోజుల పాటు తల్లిదండ్రుల ప్రేమానురాగాలను పొందనున్నారు. సంక్రాంతి పెద్ద పండగ కావడంతో ఉపాధి, ఉద్యోగాలు, వివిధ పనుల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఆరు నెలలుగా సంపాదించిన సొమ్ముతో ఇళ్లకు సున్నాలు వేసి, కొత్త దుస్తులు కొనుక్కొని సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోనున్నారు. మండలం కేంద్రంలో బస్సుల నుంచి దిగే కూలీలే గత వారం రోజులుగా కనిపిస్తున్నారు.సంతలో సంక్రాంతి శోభ మండల కేంద్రంలో గురువారం జరిగే వారపు సంతకు సంక్రాంతి శోభ సంతరించుకుంది. వారపు సంతలో కొత్తబట్టలు కొనుగోలుదారులతో బట్టల దుకాణాలు కిటకిటలాడాయి. ఈ వారపు సంత భోగి పండగకు మూడు రోజులు ముందు కావడంతో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గిరిజనులు క్రయవిక్రయాలు జరిపారు. మన్యం ప్రాంతంలో గిరిజనులు అన్ని అవసరాలకు వారపు సంతపైనే ఆధారపడతారు. మైదాన ప్రాంతానికి వెళ్లి కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం గనుక అందుబాటులో ఉన్న వారపు సంతలను ఆశ్రయిస్తున్నారు. సంక్రాంతి పండగ అంటేనే ఆచార సాంప్రదాయాలతో కూడిన పండగ. గిరిజన రైతులు పండించిన, సేకరించిన వాణిజ్య పంటలైన చిక్కుళ్లు, ఎర్ర కందులు, తెల్లకందులు, పసుపు, పిప్పళ్లు, గుమ్మడి కాయలు, కొండ చీపుర్లు, కరక్కాయలు వంటి అటవీ ఉత్పత్తులను సమకూర్చుకొని సేకరించి ఆదాయాన్ని పండగ అవసరాలు తీర్చుకుంటున్నారు. పండుగకు ఇంటికి ఎవరు వచ్చినా మద్యం ఇస్తారు. అదే గిరిజనుల ఆచారం. సంక్రాంతి పండగ శోభతో వారపు సంతల్లోనూ, గ్రామాలన్ని కళకళలాడుతున్నాయి.భామిని: స్థానిక ఎఎంసి మార్కెట్ యార్డ్లో జరిగిన వారపు సంతలో సంక్రాతి శోభ సంతరించుకుంది. ఏటా సంక్రాతి ముందు వచ్చే వారపు సంతకీ ప్రేత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గురువారం జరిగిన సంతలో భామిని పరిసర ప్రాంతం గిరిజనులు, గ్రామస్థులు సంక్రాతికి అవసరమైన కొత్త మట్టి కుండలు, కొత్త బెల్లం, కొత్త చింత పండు, బట్టలు, వంట పాత్రలు, కర్ర గరిటెలు, మసాలా దినుసులు కొనుక్కున్నారు. ఏటా సంక్రాతి ముందు వచ్చే గురువారం సంతలో వస్తువులు కొనడం ఆనవాయతీ అని సంతకి వచ్చిన మహిళలు తెలిపారుG.