సిపిఎం
ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : పార్లమెంట్ లో శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం చేసేదిగా ఉందని సిపిఎం నాయకులు బి వి రమణ, గొర్లీ వెంకటరమణ విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కేంద్ర బడ్జెట్ కు నిరసనగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర విద్యా సంస్థలైన గిరిజన యూనివర్సిటీ, ఐఐటి ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ, కడప ఉక్కు పరిశ్రమకు కనీస కేటాయింపులు కూడా ఈ బడ్జెట్ లో చేయలేదని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు గతంలో కేటాయించిన కేటాయింపుల కంటే తక్కువ కేటాయింపులు చేశారని, ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన విశాఖపట్నం రైల్వే జోన్ కు, మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు ఈ బడ్జెట్ లో చేయలేదని విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించాల్సిన కేటాయింపులు కూడా ఈ బడ్జెట్లో చేయలేదని విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి గతంలో ప్రపంచ బ్యాంకు నుండి ఇచ్చిన అప్పు తప్ప బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి, మౌలిక వసతులు కల్పనకు, నీటి పారుదల ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు కూడా ఈ బడ్జెట్ లో చేయకపోవడం విచారకరమని విమర్శించారు. ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసితో సహా ఇతర ఇన్సూరెన్స్ సంస్థలను 100 శాతం ప్రైవేటీకరణ చేసేందుకు ఈ బడ్జెట్లో రూపకల్పన చేయడం మరీ దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని ఈ బడ్జెట్ ను అధికార కూటమి సమర్ధించడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని అధికార కూటమి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చే విధంగా కేటాయింపులు చేసేందుకు పూనుకోవాలని లేనియెడల ఈ ప్రభుత్వం కూడా ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దావాల రమణారావు, ఎం ఉమామహేశ్వరి, బంకురు సూరిబాబు, సంచాన ఉమాహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
