సాలూరు: పట్టణంలో ఈనెల 18 నుంచి 21 వరకు శ్యామలాంబ అమ్మవారి పండగలు అంగరంగ వైభవంగా జరగాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. శ్యామలాంబ అమ్మవారి పండుగల నిర్వహణపై సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సమన్వయ సమావేశంలో ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ శోబిక, చైర్పర్సన్ పి.ఈశ్వరమ్మ, వైస్ చైర్మన్ వి.అప్పల నాయుడుతో కలిసి మంత్రి సోమవారం సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జాతరకు సుమారు 11లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు తగిన విధంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పండగ మూడు రోజులు ఎక్కడా విద్యుత్ అంతరాయం ఉండరాదని, ప్రభుత్వపరంగా అందించాల్సిన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. 900 మందితో పటిష్ట బందోబస్తు, బారికేడింగు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అలాగే పండుగల రోజుల్లో కమాండ్ కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ వుండాలని, ట్రాఫిక్, వాహనాల పార్కింగుకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మండల ప్రత్యేక అధికారి, ఎంపిడిఒ, తహశీల్దార్, కమిషనర్, పోలీస్ అధికారులు సమన్వయం చేసుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. 100 మంది పారిశుధ్య కార్మికులతో అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి అధికారులు గుంతల్లేని రహదారులకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున తగ్గినన్ని బస్సులు నడపాలని ఆర్టిసి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పట్టణంలోని 29 వార్డులకు 25 వరకు మంచి నీటి సౌకర్యానికి అంతరాయం లేకుండా చూడాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్ధాలు, పానియాలు విక్రయాలు వంటివి లేకుండా ఎక్సయిజ్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, పండుగలు సజావుగా జరిగేలా కషిచేయాలని మంత్రి పిలుపు నిచ్చారు. ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక మాట్లాడుతూ శ్యామలాంబ అమ్మవారి పండుగలు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయిస్తామన్నారు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్, పారిశుధ్యం, భక్తుల కొరకు ప్రత్యేక క్యూ లైన్లు, వైద్య శిబిరాలు తదితర ఏర్పాట్లను ఆయా శాఖాధికారులతో సమావేశం ఏర్పాటుచేసి విధులు కేటాయిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా దేవాదాయ శాఖాధికారి ఎస్.రాజారావు, శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం ఇఒ టి.రమేష్, మండల ప్రత్యేక అధికారి శివన్నారాయణ, మున్సిపల్ కమిషనర్ డిటివి కృష్ణారావు, తహశీల్దార్ ఎన్వి రమణ, ఎంపిడిఒ జి.పార్వతి, ఎస్డిపీఓ ఎం.రాంబాబు, జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం.రవి ప్రసాద్, డిపిఒ టి.కొండలరావు, జిల్లా ఆర్డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి బి.చంద్రశేఖర్, జిల్లా విపత్తుల స్పందన అధికారి కె.శ్రీనుబాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
