ప్రజాశక్తి-పాచిపెంట : కుడుమూరులో సర్వే నంబర్ 48లో 11 గ్రామాల గిరిజనులు 782 ఎకరాలను సాగుచేస్తున్నారని, వారికి పట్టాలివ్వాలని ఎస్టి కమిషన్ చైర్మన్ డివిజి శంకరరావును ఆదివాసీ గిరిజన సంఘం, కుడుమూరు భూపోరాట కమిటీ నాయకులు కోరారు. మండలంలోని పెద్దగెడ్డ జలాశయాన్ని, గ్రీన్ఫీల్డ్ హైవేను బుధవారం డివిజి శంకరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన్ను ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్ని రామయ్య, కుడుమూరు భూ పోరాట కమిటీ నాయకులు సుకురు అప్పలస్వామి, నిర్వాసిత మత్స్యకారుల సంఘం నాయకులు మోసూరు చిన్నారావు, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు కలిసి, వినతిపత్రం అందజేశారు. కుడుమూరులో గిరిజనుల సాగులో ఉన్న భూములకు దశాబ్దాలుగా పట్టాలు ఇవ్వకపోవడంతో ఆ భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ భూమిని మొకాసా పేరుతో ఏళ్ల తరబడి డబ్బులు వసూలు చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో సర్వే చేసిన వివరాలను కూడా నేటికీ బహిర్గతం చేయలేదని చెప్పారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఆ భూములకు హక్కులు కల్పించి గిరిజనులను ఆదుకోవాలని చైర్మన్ను వారు కోరారు. గిరిజనులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ఫీల్డ్ రహదారి వల్ల భూములు కోల్పోయిన బంగారు గుడ్డి, కాట్రగుడ్డి, బుచ్చింపాడు గిరిజనులు పట్టాలు లేకపోవడంతో నష్టపోయారని, వారిని ఆదుకోవాలని కోరారు. గ్రీన్ఫీల్డ్ హైవే అధికారులు సైడ్ వాల్ నిర్మించారని, దీనివల్ల వ్యవసాయ పంటలను ఇంటికి తెచ్చుకోలేక, మార్కెట్కి తీసుకు వెళ్లలేక నరకయాతన పడుతున్నామని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే కింద నుంచి సర్వీస్ రోడ్డు వేయాలని కోరారు. గిరిజన చట్టాలు సక్రమంగా అమలు చేయాలని, జిఒ 3ని కొన సాగించి, గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గిరిజన మత్స్యకారులకు అధునాతనమైన లైఫ్ జాకెట్లు, వలలు, బోట్లు పంపిణీ చేయాలని కోరారు. పెద్దగడ్డ జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి అభివృద్ధి పరచాలన్నారు. అనంతరం చైర్మన్ డివిజి శంకర్రావు మాట్లాడుతూ ఈ సమస్యలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కొటికిపెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు, ఎంపిటిసి సభ్యులు దండి ఏడుకొండలు, తహశీల్దార్ డి.రవి, ఆర్ఐ వెంకటరమణ, సీనియర్ అసిస్టెంట్ పి.తిరుమల రావు, విఆర్ఒ పి.ప్రశాంత్, గిరిజన రైతులు పాల్గొన్నారు.
