పని ఎక్కువ.. ఫలితం తక్కువ..

May 9,2025 20:42

గ్రామాల్లో పనులు చేపట్టి, పేదలు వలస బాట పట్టకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వామపక్షాల చొరవతో యుపిఎ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని వ్యవసాయ, ఉద్యాన, ఇంజినీరింగ్‌ అభివృద్ధి పనులకు అనుసంధానం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కూలీలు చేసిన పనికి తగ్గ ఫలితం రావటం లేదు. ప్రకటనల్లో రోజు కూలి రూ.307 వరకు ఇస్తామని చెబుతున్నా.. ఎక్కడా అలా వచ్చిన సందర్భాలు లేవు. వేసవి అలవెన్సులు సైతం కోతపెట్టారు. పనిముట్లూ ఇవ్వడం లేదు. ఈ భారం కూలీలపైనే పడుతోంది. క్రమంగా కూలీలను ఉపాధి హామీకి దూరం చేసే పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి.

ప్రజాశక్తి-సీతంపేట: సీతంపేట మండలంలో సుమారు 13 వేల మంది ఉపాధి వేతనదారులు ఉన్నారు. వారిలో గత ఏడాది 7000 మందికి వంద రోజుల పని కల్పించారు. ఈ ఏడాది రూ.57 కోట్లతో 13 వేల మంది కూలీలకు 12.30 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం క్యూబిక్‌ మీటర్‌ (మీటర్‌ వెడల్పు, మీటర్‌ పొడవు, మీటర్‌ లోతు కొలతలతో) వైశాల్యంలో తవ్వితే ఒక వేతనదారుడికి సగటున రూ.240.97 చెల్లించాలి. ఉపాధి హామీలో రూ.307 వరకు వేతనదారులకు చెల్లించవచ్చు. అడుగు లోతు 2 మీటర్లు వెడల్పు, 2.3 మీటర్ల పొడవు కొలతల ప్రకారం ఆరు గంటలు తవ్వితే ఉపాధి చట్టం ప్రకారం 307 రూపాయలు వస్తుంది. ఉపాధి హామీలో ఇచ్చిన కొలతల ప్రకారం ఉదయం, సాయంత్రం తవ్వినా సాధ్యం కాదని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సరాసరిగా వేతనదారుడికి రూ.257 మించి కూలి రావడం లేదు. గతంలో కొలతలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం లక్ష్యం ఎక్కువగా ఉంటుందని, కానీ కూలి మాత్రం గిట్టుబాటు కావడం లేదని కూలీలు వాపోతున్నారు.పనిముట్లు హుళక్కే! గతంలో ఉపాధి హామీ వేతనదారులకు గునపాలు, తాగునీటి బిందులు, గ్లాసులు ఉచితంగా ఇచ్చేవారు. దాంతోపాటు ఎండకు ఇబ్బంది కలగకుండా టెంట్లు ఏర్పాటు చేసేవారు. ఉపాధి హామీ పనిచేస్తుండగా ఏవైనా గాయాలైతే ప్రథమ చికిత్స బాక్సులు కూడా ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఏప్రిల్‌, మే నెలల్లో ఏజెన్సీ అలవెన్సులు ఆదనంగా 30 శాతం ఇచ్చేవారు. ప్రస్తుతం ఏ అలవెన్సూ ఇవ్వడం లేదని వేతనదారులు వాపోతున్నారు.

➡️