వేతన ఒప్పందం అమలు చేయాలి

May 9,2025 20:40

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : జిల్లా ప్రజా రవాణా అధికారి సమక్షంలో చేసిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ ఆర్‌టిసి కాంట్రాక్టు కార్మికులు ఆర్‌టిసి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన చేపట్టిన సమ్మె శుక్రవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పార్వతీపురం ఆర్‌టిసి గ్యారేజీ బయట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్‌టిసి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు తులసీరామ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ జెఎసి జిల్లా కన్వీనర్‌ బి.వి.రమణ మాట్లాడారు. అత్యంత తక్కువ వేతనంతో ప్రభుత్వం ఆర్‌టిసి గ్యారేజీల్లో కాంట్రాక్టు కార్మికులతో పనిచేయించుకుంటోందని తెలిపారు. ఆర్‌టిసి చెల్లిస్తున్న వేతనం కూడా పూర్తిస్థాయిలో కాంట్రాక్టర్లు ఇవ్వడం లేదని, కోతలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాన్ని కాపాడేందుకు టెండర్‌లో కమీషన్‌ కూడా ప్రభుత్వం చెల్లిస్తున్నా, కార్మికుల వేతనాల్లో కోతలు విధించడం ఎంతవరకు సమంజసమని? ప్రశ్నించారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బంకురు సూరిబాబు, ఆర్‌టిసి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు భాస్కర్‌రావు, కృష్ణకాంత్‌, వెంకటేష్‌, గణపతి, తదితరులు పాల్గొన్నారు.

➡️