ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మన్యం గిరిజన విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కొనియాడారు. టెన్త్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల ఉండడంతో పరీక్షల్లో మంచి ఫలితాల సాధనకు దోహదపడ్డాయని, రాష్ట్రస్థాయిలో గుమ్మలక్ష్మీపురం పేరు వినిపిస్తుందని అన్నారు. దీనిలో ఉపాధ్యాయుల కృషి కూడా ఎంతగానో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మంచి ఫలితాలు సాధించారంటే ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత, ప్రోత్సాహం, ఉపాధ్యాయుల ఉత్తమ బోధన, పాఠశాలల్లో సౌకర్యాలు కల్పన కారణం అన్నారు. మూడోసారి జిల్లాకు పేరు రావడం హ్యాట్రిక్గా వర్ణించారు. భవిష్యత్తులో కూడా చదువు పట్ల ఆసక్తి కనబరిచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని సూచించారు. అత్యధిక మార్కులు సాధించిన 39 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానించి సత్కరించారు. విశ్రాంత డిఇఒ ఎన్.తిరుపతినాయుడు మాట్లాడుతూ విద్యార్థుల్లో చదువుకోవాలనే సంకల్పం ఉన్ననాడే మంచి విద్యార్థులుగా సమాజంలో గుర్తింపు పొందగలరని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఇఒ జ్ఞాన ప్రకాష్, ఎంపిడిఒ సాల్మన్ రాజు, తహశీల్దార్ శేఖర్, ఎటిడబ్ల్యూఒ సురేష్ కుమార్, ఎంఇఒ 1,2లు చంద్రశేఖర్, బిడ్డిక భీముడు, విశ్రాంతి ఉపాధ్యాయులు హరిప్రసాద్, జగన్నాథ్ రథో, 13 పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.నేడు రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన జియ్యమ్మవలస ఆర్ అండ్ బి రహదారి నుంచి గెడ్డతిరువాడ పంచాయతీ చిలకలవానివలస మీదుగా పసుపువానివలస వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేయనున్నట్లు ఎంపిపి బొంగు సురేష్ తెలిపారు. జియ్యమ్మవలస మండలంలో గల కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
