ప్రజాశక్తి-సీతానగరం : ప్రతీ పిహెచ్సి పరిధిలో బుధ, శనివారాల్లో టీకా కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు సూచించారు. మండలంలోని చిన్నరాయుడుపేట గ్రామంలో బుధవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. గృహ సందర్శనలు చేసి పిల్లల టీకా కార్డులను తనిఖీ చేశారు. పిల్లల వయస్సు బట్టి టీకాలు షెడ్యూల్ ప్రకారం వేస్తున్నారా? అని వ్యాక్సిన్ తేదీలను పరిశీలించారు. టీకా గడువు తేదీల నమోదుపై గమనించి ముందుగా తెలియజేస్తున్నారా? అని తల్లిదండ్రులను అడిగి తెలుసుకొన్నారు. టీకా ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్య వివరాలు తెలుసుకుని ప్రాథమికంగా అవసరమైన మందులు గ్రామంలో అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. వేసవిలో పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కార్యక్రమంలో ఎపిడమిక్ ఇఒ సత్తిబాబు, వైద్య సిబ్బంది ఉన్నారు.
