ప్రజాశక్తి – పెద్దాపురం : అకాల వర్షాలకు కల్లాలలో తడిసిపోయిన ధాన్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సోమవారం ఆయన పెద్దాపురం మండలం జే తిమ్మాపురం గ్రామంలో రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖాధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కల్లాలలో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ వరి కోతలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అకాల వర్షాల గురించి, కల్లాలలో తడిసిపోయిన ధాన్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ , కుడా చైర్మన్ తుమ్మల బాబు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఎం నాయక్, వ్యవసాయ శాఖ జే డి ఎన్ విజయ్ కుమార్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
