ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు) : ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి నారాయణ మంగళవారం పరిశీలించారు. మోడీ మే 2 న రాజధాని పనుల పున: ప్రారంభానికి రానున్నారు. గడువు సమీపిస్తుండడంతో ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఈ నేపధ్యంలో మంత్రి అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్‌ ప్రాంతాలు, వేదిక వద్దకు చేరుకునే మార్గాలను గురించి అధికారులతో చర్చించారు. వర్షం వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాలని సూచించారు. మే 2 న సాయంత్రం 3.25 కి ప్రధాని అమరావతి వస్తారని, పర్యటనకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. బుధవారం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. రూ.43 వేల కోట్ల పనులను ప్రధాని ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు. సోమవారం రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండుగంటలపాటు మాట్లాడారని, 29 గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని ఆహ్వానించారని చెప్పారు. అమరావతిపై పార్లమెంట్‌ లో చట్టం చేయాలని రైతులు అడిగారని, చట్టబద్ధత అంశాన్ని పరిశీలించాలని సిఎం అధికారులకు సూచించారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజ్‌ ఐజి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా కమిషనర్‌ వీర పాండ్యన్‌, కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి, ఎస్పి సతీష్‌ కుమార్‌, సంయుక్త కలెక్టర్‌ భార్గవ్‌ తేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️