స్వాధీనం చేసుకున్న యంత్రాలు
ప్రజాశక్తి – మేడికొండూరు : పేరేచర్ల కొండల చెరువు సమీపంలో మిర్చి నకిలీ విత్తనాలను తయారీని సిపిఎం నాయకులతో కలిసి స్థానికులు శుక్రవారం అడ్డుకున్నారు. యంత్రాలను పంచాయతీ అధికారులకు అప్పగించారు. దీనిపై సిపిఎం నాయకులు ఎస్ఎం సాధిక్ వివరాల ప్రకారం.. పేరేచర్ల డొంక ఐస్ ఫ్యాక్టరీ సమీపంలోని స్థానికులు, ముఖ్యంగా పిల్లలు గత వారం రోజుల నుండి మిర్చి కోరుకు ఇబ్బంది పడుతున్నారని, శుక్రవారం కొంతమంది సమీపంలోని కొండల చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా మిర్చి విత్తన తయారీ సామగ్రిని గమనించారు. ఆ ప్రాంతంలో ఏడు పాయింట్లు ఉండగా రెండు పాయింట్లలోని వ్యక్తులను, మిర్చి గోతాలు తెచ్చిన లారీలను పంచాయతీ అధికారులకు అప్పగించారు. విత్తనాల తయారీ ప్రాంతాన్ని పంచాయతీ గుమస్తా ఉస్మాన్ పరిశీలించారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో విత్తన తయారీదార్లను పంచాయతీ కార్యదర్శికి అప్పగించామని సిపిఎం నాయకులు ఎఎస్ఎం సాధిక్ తెలిపారు. అయితే ఇప్పుడు మళ్లీ అక్రమ వ్యాపారం ప్రారంభించారని, దీనిపై అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయం ఎదుట కొద్దిసేపు ఆందోళన చేశారు. కార్యక్రమంలో గంజి రామిరెడ్డి, పివి నారాయణ, చాగంటి సంజీవరెడ్డి, బయ్యపురెడ్డి, పి.సుధాకర్రెడ్డి, రాములమ్మ, ఎస్.నాగేంద్రం, పి.లక్ష్మి, విజయం, రెడ్డెం పద్మ, చేరెడ్డి పద్మ, ధనుష్, పి.వెంకట్ రెడ్డి, గోపి పాల్గొన్నారు.
