ఉచిత వైద్య సేవ.. వెనుక డబ్బు యావ!

May 8,2025 21:46

 శిబిరాల పేరుతో పేదల మభ్యపెడుతున్న కార్పొరేట్ల మాయాజాలం

ప్రజాశక్తి – మక్కువ : ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి ఉచితంగానే కార్పొరేట్‌ ఆసుపత్రుల ద్వారా ఆరోగ్య సేవలందిస్తున్నప్పటికీ పలు ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రి వారు నిర్వహించే ఉచిత వైద్యశిబిరాల మాయలో పడి వారికి తెలియకుండానే మోసపోతున్నారు. ఉచితం పేరుతో ప్రజలకు వైద్యం సేవలందించే కార్పొరేట్‌ నెట్వర్క్‌ హాస్పటళ్లను, వైద్యులను తప్పకుండా అభినందించాల్సిందే. కానీ కొంతమంది ఉచితం పేరుతో శిబిరాలు నిర్వహించి వారి ఆసుపత్రులకు రోగులను రప్పించుకొని ప్రభుత్వం అందించే ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ద్వారా దండిగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వపరంగా 104 లాంటి వాహనాలతో మొబైల్‌ సేవలు అందుతున్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులు ప్రత్యేకంగా పిఆర్వోలను నియమించుకొని డబ్బులు వెదజల్లి ప్రకటనలు గుప్పించి గిరిజన ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఉచితం ఎరవేసి దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే సందర్భంలో వందకు 25మంది రోగులనైనా ఆసుపత్రులకు చేరితే చాలు వారి పంట పడినట్లేనని పలువురు ఆరోపిస్తున్నారు.కొందరైతే నేరుగా ఉచిత సేవలు అందిస్తామని నమ్మబలికి వాహనాల ద్వారా ఆసుపత్రికి వెళ్లాక రోగుల నుంచి వివిధ టెస్టుల పేరుతో డబ్బులు గుంజుకునే పరిస్థితి ఉందని పలువురు వాపోతున్నారు. అలాగే మందులు కూడా బయట కొనుక్కోమంటున్నారని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉన్నా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ఆసుపత్రులకు రోగులు కరువైనప్పుడు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం పరిపాటేనని పలువురు చర్చించుకుంటున్నారు. శిబిరాల వద్ద ప్రైవేట్‌ ఆసుపత్రులు అందించే ఉచిత ఖరీదైన తనిఖీలను చూసి వారు చెప్పే మాయమాటలకు ప్రలోబపడి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి మోసపోకుండా ప్రభుత్వ రంగంలో ఉండే పెద్ద ఆసుపత్రులకు వెళ్తే ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

➡️