ప్రజాశక్తి-విజయనగరం : నగరంలోని పూల్బాగ్ మోడల్ స్కూల్లో విద్యార్థులకు పోక్సో చట్టంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్చక్రవర్తి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బాలికలు చాలా జాగ్రత్తగా ఉండాలని, వారి పట్ల ఎవరైనా అనుచితంగా గాని, అసభ్యంగా గాని ప్రవర్తిస్తే తల్లిదండ్రులకు లేదా టీచర్లకు తెలియజేయాలని సూచించారు. బాల బాలికలకు న్యాయవ్యవస్థ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. బాలల హక్కులను కాపాడడానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. బాలబాలికలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారి పట్ల కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో మెలగాలని నైతిక విలువలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి బి. అప్పలస్వామి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి టివి రాజేష్ కుమార్, ఎంఇఒ పి. సత్యవతి, మోడల్ స్కూలు ప్రిన్సిపాల్ పి.ఫర్వీన్ తదితరులు పాల్గొన్నారు.
