ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : అమ్మతనం కన్నా కమ్మనైనది ఈ సృష్టిలో లేదని, అమ్మను అందరూ దైవంగా ఆరాధించి పూజించాలని కొత్తపేట ఐసీడీఎస్ సీడీపీఓ అధికారి ఏ.గజలక్ష్మి అన్నారు. మదర్స్ డే ను పురస్కరించుకుని ఒక రోజు ముందుగా మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సీడీపీఓ గజలక్ష్మి ప్రారంభించారు. స్థానిక యానాదులపేటలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లికి వందనం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. అంగన్వాడీ చిన్నారులందరూ తమ తల్లులకు కాళ్లు కడిగి పాదపూజ చేసి అశీర్వచనాలు అందుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సీహెచ్.సరోజారాణి, జి.లక్ష్మీకుమారి, జి.సూర్యకుమారి, వి.ఆనందకుమారి, ఎం.రామలక్ష్మి, డి.మణి, బి.వరలక్ష్మి, డి.శ్యామల తదితరులు ఈసందర్భంగా మదర్స్ డే ఆవశ్యకతను వివరించారు. ప్రతి బిడ్డ తొలి పలుకే అమఅతం లాంటి పదం అమ్మ అని తెలియజేశారు. అమ్మ లేకుంటే ఈ సృష్టే లేదేని, ప్రేమమూర్తి లాంటి అమ్మ రుణాన్ని ఎన్నటికి తీర్చుకోలేనిదన్నారు. జీవితంలో తొలి గురువుగా భావించే తల్లిని అందరూ ఎల్లప్పుడు గౌరవించి అమె అడుగుజాడల్లో నడవాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లోనున్న అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ శాఖ ఆదేశాల మేరకు తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు.
