రైల్వే కూలీల వినతికి స్పందించిన ఎంపీ డా.మద్దిల గురుమూర్తి

May 5,2025 14:56 #MP Gurumurthy, #Tirupati

ప్రజాశక్తి – తిరుపతి టౌన్ : తిరుపతి రైల్వే స్టేషన్‌లో పని చేస్తున్న లైసెన్స్‌డ్ కూలీలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం తిరుపతి ఎంపి డా. మద్దిల గురుమూర్తిని కలిసి వినతి పత్రం సమర్పించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కారణంగా తాము ఉపాధిని కోల్పోతున్నామన్న విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలపై స్పందించిన ఎంపీ గురుమూర్తి రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో, తిరుపతి రైల్వే స్టేషన్‌లో గత 15 నుండి 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న లైసెన్స్‌డ్ పోర్టర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. స్టేషన్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ఎస్కలేటర్లు, బ్యాటరీ వాహనాలు, లగేజ్ ట్రాలీలు వలన కూలీల అవసరం తగ్గడంతో వీరి ఆదాయం తీవ్రంగా పడిపోయిందని వివరించారు. చాలామంది పోర్టర్లు నిరక్షరాస్యులు కావడంతో, ఇప్పుడు విస్తృతంగా వినియోగంలో ఉన్న ఆన్‌లైన్ పోర్టర్ బుకింగ్ సదుపాయాలు వీరికి అందుబాటులో లేవని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగ ప్రయాణికులకు వీరు అందించే సహాయ సేవలు ఇప్పటికీ అత్యవసరంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీరి జీవనోపాధి పరిరక్షణ కోసం స్టేషన్ ఆధారిత ఉద్యోగాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వడం, లైసెన్స్‌డ్ పోర్టర్ సేవలను కొనసాగించడం, ఆఫ్‌లైన్ బుకింగ్ సదుపాయాలను అందుబాటులో ఉంచడం, సంక్షేమ పథకాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అలాగే వీరి సుదీర్ఘ సేవలను పరిగణలోకి తీసుకుని జీవనోపాధి కల్పించే విధంగా న్యాయం చేయాలని ఎంపీ డా. గురుమూర్తి రైల్వే మంత్రిని కోరారు.

➡️