ప్రజాశక్తి-విజయనగరంకోట : భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు తమ కుటుంబ సమేతంగా మంగళవారం కలిశారు. రాష్ట్రపతికి మర్యాద పూర్వకంగా పుష్ప గుచ్చం అందించారు. ఆనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా విజయ నగరంలో ఏర్పాటు చేయబోతున్న మహిళల సమావేశానికి రావాలని రాష్ట్రపతిని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికులు నేసిన చీరను రాష్ట్రపతికి కలిశెట్టి కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతితో ఎంపి మాట్లాడుతూ రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాల్లో వెనుకబడిన వర్గాలైన మహిళలతో కార్యక్రమం చేపట్టామని, వారు వారి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళే విధంగా వారిని మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని అనుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చి మహిళల్లో స్ఫూర్తి నింపాలని కోరారు. దీనికి రాష్ట్రపతి సమ్మతించినట్లు ఎంపి తెలిపారు.