ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలంలో ప్రజాప్రతినిధులకు ఎక్కడా గౌరవం తగ్గకుండా చూసుకుంటున్నామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి జయమణి అన్నారు. శనివారం నాడు శింగరాయకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కట్ట శోభారాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సామంతుల రవికుమార్రెడ్డి గ్రామాల్లో జరుగుతున్న అధికార కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కడం లేదని అలా జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో తహశీల్దార్ టి రవి మాట్లాడుతూ బింగినపల్లి గ్రామంలో అలా జరగకుండా రెండోసారి జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. ఎంపిడిఓ డి జయమణి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ఎక్కడా గౌరవం తగ్గకుండా చూస్తున్నామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచన సలహాలతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని వివరిం చారు. రామతీర్థం రిజర్వాయర్ నుంచి శింగరాయకొండ మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛమైన నీరు ఇచ్చేందుకు పనులు మొదలు పెడతామని అన్నారు. మల్లికార్జున్ నగర్ వద్ద భారీ సంపు ఏర్పాటు చేసి తాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని, ఎప్పటికే సర్వే పూర్తయి పనులు అతి త్వరలో జరుగుతాయని వివరించారు. పల్లె పండుగ ద్వారా కోట్ల రూపాయల నిధులతో 9 గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అధికారులు ఈ సందర్భంగా వివరించారు. శింగరాయకొండ సర్పంచ్ తాటిపర్తి వనజ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కత్తి శ్రీనివాస రావు పంచాయతీరాజ్ జెఈ కోటా శ్రీహరి డాక్టర్ చైతన్య కృష్ణ పరశువైద్యులు డాక్టర్ హజరత్తయ్య, ఏపీవో సుధాకర్, ఏపీఎం భాగ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
