శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే
ప్రజాశక్తి – వినుకొండ : అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధి, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యం దిశగా ప్రతి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఇల పార్కులు ఏర్పాటు చేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఐదేళ్లలో 20 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీ మేరకే చర్యలు చేపట్టామన్నారు. బొల్లాపల్లిలో 70 ఎకరాల్లో రూ.7 కోట్లతో ఎంఎస్ఎంఇ పార్కుకు ఎంపీ, ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంఎస్ఎంఇ పార్కుల ఏర్పాటుతో వేలాదిమందికి ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విద్యుత్ సహా పలు విభాగాల్లో మహిళలకు ప్రత్యేక రాయితీలు, అదనపు ప్రోత్సాహకాలు ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. స్థానికంగా చదువుకున్న యువతను ప్రోత్సహించి ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఇ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహి ంచేలా చర్యలు చేపట్టామని, వారికి ష్యూరిటీ లేకుండా రూ.కోటి వరకు రాయితీ రుణాలు ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు.
వినుకొండ, బొల్లాపల్లిలో కేజీబీవీ హాస్టళ్లు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటులో రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని ఎంపీ, ఎమ్మెల్యే అన్నారు. పల్నాడులో 24 వరకు కేజీబీవీలు ఉండటం ఒక రికార్డు అని తెలిపారు. గతంలో పదో తరగతి వరకు ఉండే ఈ విద్యా సంస్థల్లో ఇంటర్ కూడా వచ్చిన తర్వాత ఆదరణ మరింత పెరిగిందని చెప్పారు. వినుకొండ, బొల్లాపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల వసతి భవనాలకు వారు శంకుస్థాపన చేశారు. వినుకొండలో ఎన్ఎస్పి స్థలంతో పాటు బొల్లాపల్లిలో రూ.2.50 కోట్ల చొప్పున హాస్టళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్లో 70 శాతానికిపైగా మార్కులు వచ్చిన ఎస్టీ బాలికలకు విజ్ఞాన్ విద్యా సంస్థల్లో ఉచితంగా ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తామని ఎంపీ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరికపూడిశెల ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తి చేస్తామని, దీనిపై సిఎం సానుకూలంగా ఉన్నారని అన్నారు. క్రీడలను ప్రోత్సహించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంచడానికి అన్ని విధాల ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమాల్లో జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
లిఫ్ట్లో ఇరుకుపోయిన ఎంపీ, ఎమ్మెల్యే
వినుకొండలోని లాయర్ స్ట్రీట్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే, జిడిసిసిబి చైర్మన్ 15 నిమిషాల పాటు లిఫ్ట్లో ఇరుకుపోయారు. సామర్థ్యానికి మించి లిఫ్టులో నలుగురు ఎక్కటం వలన లిఫ్ట్ మధ్యలో స్ట్రక్ అయి నిలిచిపోయింది. వెంటనే టెక్నీషియన్ను పిలిపించి సమస్యను పరిష్కరించారు.
రాయితీపై దాణా అందజేత
ప్రజాశక్తి-ఈపూరు:రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జీవి ఆంజనేయులు అన్నారు. బొల్లాపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయలుతో కలిసి బొల్లాపల్లిలో రైతులకు 50 శాతం రాయితీపై పశువుల దాణాను అందించారు. పశుసంవర్ధక శాఖ పల్నాడు జిల్లా అధికారి కె.కాంతారావు,ఈపూరు ప్రాంతీయ వైద్యశాల సహాయ సంచాలకులు పి.శ్రీనివాసమూర్తి, పశువైద్యాధికారులు పాల్గొన్నారు.
