ఉగ్రదాడితో ముమ్మర తనిఖీలు

Apr 27,2025 00:34

పిడుగురాళ్ల వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలోని పహల్గాం ప్రాంతంలో తీవ్రవాదులు దాడుల నేపథ్యంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో శనివారం సాయంత్రం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పల్నాడు జిల్లా ఎస్‌పి కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్‌, లాడ్జిలు, జనసంచార ప్రదేశాల్లో తనిఖీలతోపాటు ప్రధాన ట్రాఫిక్‌ కూడళ్ల వద్దముఖ్య ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద వాహనలను తనిఖీ చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను ఎస్పీ కోరారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సి.సి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లాలోనూ తనిఖీలు జరిగాయి. కనకదుర్గమ్మ వారధి, ప్రకాశం బ్యారేజి, గుంటూరు రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాల్లో వాహనాలను, ప్రధాన కూడళ్లలో తనిఖీచేశారు. బస్టాండ్లు, ఆటో స్టాండ్లు, మార్కెట్లు, జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సాంకేతిక పరికరాల ద్వారా అనుమాని తుల వేలిముద్రలు పరిశీలిం చారు. లాడ్జిలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సరైన రికార్డులు లేకుండా ఎవరికి గదులు, ఇళ్లు అద్దెలకు ఇవ్వవద్దని ఆదేశించారు. అంతర్‌ జిల్లా చెక్‌ పోస్టులు, ఇతర జిల్లాల నుండి జిల్లాలోకి వచ్చే వెళ్లే మార్గాలలో విస్తృత వాహన తనిఖీలు చేశారు. జిల్లా అంతటా భద్రత కట్టుదిట్టం చేశామని గుంటూరు జిల్లా ఎస్‌పి సతీష్‌కుమార్‌ తెలిపారు.
పాకిస్తానీయులను గుర్తించాలని కలెక్టర్‌ ఆదేశాలు
పాకిస్తానీయులను దేశం నుండి ఈ నెలాఖరులోగా తిరిగి పంపించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని పాకిస్తానీయులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌డిఒలను ఆదేశించినట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు తెలిపారు. సాధారణ వీసాలపై వచ్చిన వారు ఆదివారం నాటికి, వైద్య వీసాలపై వచ్చినవారు మంగళవారం నాటికి దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 30 తర్వాత అట్టారీ సరిహద్దును మూసివేస్తున్న దృష్ట్యా పాకిస్తాన్‌ నుండి వీసాపై జిల్లాకు వచ్చిన వారిని గుర్తించాలని పేర్కొన్నారు.

➡️