ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పనిచేసిన అన్ని రోజులకు వేతనాలు ఇవ్వాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మునిసిపల్ కార్మికుల ఆందోళన శిబిరాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సమ్మె శిబిరాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ సిలార్ మసూద్ పేర్కొన్నారు. ధ్వంసం అయిన సమ్మె శిబిరాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ …. సోమవారం నరసరావుపేట రెండవ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి సమక్షంలో చర్చలు జరిగిన చర్చలు సందర్భంగా 47 రోజుల నుండి నిరసన దీక్షలు చేస్తున్న మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని మున్సిపల్ అధికారులను జడ్జి ఆదేశించిన కొన్ని గంటలలో సమ్మె శిబిరం ధ్వంసం కావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. సమ్మె శిబిరం ధ్వంసం ఘటనపై సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించి మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్నవారికి జరిగిన అన్యాయానికి మద్దతు ఇవ్వాలని సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
సమ్మె శిబిరం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : మున్సిపల్ వర్కర్స్
