కమిషనర్కు సమెమ నోటీసు ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు : దేశవ్యాప్తంగా 20న జరిగే సమ్మెలో గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజినీరింగ్ కార్మికులు అందరూ పాల్గొంటున్నారని మున్సిపల్ కార్మిక సంఘాల నాయకుల జెఎసి నాయకులు తెలిపారు. ఈ మేరకు నగర కమిషనర్ పులి శ్రీనివాస్కు బుధవారం సమ్మె నోటీసు అందచేశారు. కేంద్రప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దుచేసి వాటి స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని, రిటైర్ అయిన, చనిపోయిన, అనారోగ్యం బారినపడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని, వెంటనే పిఆర్సీ విడుదల చేసి వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లతో సమ్మె జరుగుతుందని చెప్పారు. కమిషనర్ను కలిసిన వారిలో గుంటూరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వరికల్లు రవికుమార్, ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ప్రధాన కార్యదర్శి కోటా మాల్యాద్రి, ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు, నగర అధ్యక్షుడు పూనేపల్లి శ్రీనివాసరావు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎ.అరుణ్ కుమార్, నగర అధ్యక్షులు అంజిబాబు ఉన్నారు.
