సింగన పల్లె, చెన్నం పల్లె, అవుకు, గ్రామాల్లో విస్తరించనున్న సోలార్.
1200 ఎకరాల్లో ఏర్పాటు కానున్న హీరో సోలార్ కంపెనీ.
తుడిచిపెట్టుకుపోనున్న పంటలు
ప్రజాశక్తి-అవుకు : అవుకు మండలంలోని సింగనపల్లి చెన్నంపల్లి అవుకు గ్రామాల్లోని రైతులకు సోలార్ పవర్ ప్రాజెక్టు వలన ఒకవైపు వరం మరోవైపు శాపం కానున్నది. సుమారు 1200 ఎకరాల్లో సోలార్ హీరో కంపెనీ ఏర్పాటు కానుంది. ఈ సోలార్ కోసం ఒక ఎకరానికి 40 వేల రూపాయలు ప్రతి ఏడాది ముందస్తు గుత్తా చెల్లిస్తూ ఒక ఎకరానికి లక్షా 50 వేల రూపాయలు అడ్వాన్సుగా ఇస్తూ 30 సంవత్సరాలకు అగ్రిమెంట్లు చేసుకుంటున్నట్లు రైతులు తెలిపారు. వ్యవసాయ భూముల్లో సోలార్ విస్తరించనుండడంతో ముందు ముందు పంటలు కోల్పోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలు పండించేందుకు వేల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ దిగుబడులు మాత్రం అంతంత మాత్రమే వస్తున్నాయని మరోవైపు గిట్టుబాటు ధరలు లేక రైతులం చాలా నష్టపోతున్నామని తెలిపారు. దీంతో గత్యంతరం లేక సోలార్ కంపెనీకి పొలాలను 30 సంవత్సరాలు లీజుకు ఇస్తున్నట్లు కొందరు రైతులు తెలిపారు. ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా సంవత్సరానికి 40 వేలు ముందస్తు గుత్త ఇస్తున్నాడంతో రైతులు ఉత్సాహంగా సోలార్ కంపెనీకి తమ భూములను లీజుకు ఇస్తున్నట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో పొలాలు ఎడారిగా మారే అవకాశం ఉందని పంటలు లేక వ్యవసాయ కూలీలకు పనులు లేక ముందు ముందు పస్తులు ఉండే అవకాశం నెలకొందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ 12 ఎకరాల్లో కొన్ని భూములు మంచి పంటలు పండేవని మరికొన్ని భూములు ఖాళీగా ఉండేవని రైతులు పేర్కొంటున్నారు.
