నూతన బస్సులు ప్రారంభం

ప్రజాశక్తి-గిద్దలూరు : స్థానిక ఏపీఎస్‌ఆర్టీసీ బస్‌ డిపో ఆవరణంలో గిద్దలూరు డిపోకు నూతనంగా కేటాయించిన బస్సులను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మొదటగా టెంకాయ కొట్టి, రిబ్బన్‌ కట్‌ చేసి పచ్చజెండా ఊపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1977లో గిద్దలూరు ఏపీఎస్‌ఆర్టీసీ డిపో ఏర్పడిందని, అప్పట్లోనే జిల్లాలో గిద్దలూరు డిపో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 నూతన బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో గిద్దలూరు ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని, ప్రయాణికుల సౌకర్యార్ధం ఆర్టీసీ బస్సులను అన్ని రూట్లకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో, యూనియన్‌ నాయకులతో, డిపో మేనేజర్‌ మరియు సిబ్బందితో కలిసి గిద్దలూరు డిపో అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, ఆర్టీసీ డీఎం చంద్రశేఖర్‌, జడ్పిటిసి సభ్యులు బుడతా మధుసూదన్‌ యాదవ్‌, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ బైలడుగు బాలయ్య, సొసైటీ బ్యాంకు చైర్మన్‌ దుత్తా బాల ఈశ్వరయ్య, పట్టణ అధ్యక్షులు సయ్యద్‌ శానేశావలి, పట్టణ కౌన్సిలర్లు చంద్ర శేఖర్‌ యాదవ్‌, గడ్డం భాస్కర్‌ రెడ్డి, కో-ఆప్షన్‌ మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️