ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : డా.ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ కీర్తి పురస్కారాల్లో భాగంగా మండలంలోని గుమ్మిలేరుకి చెందిన రెడ్డి రాజేష్ చౌదరి కి ఎన్టీఆర్ కీర్తి పురస్కారం లభించింది. పాన్ ఇండియా, ఫిలంత్రోపిక్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటున్నవారి సేవలకు గుర్తింపుగా డాక్టర్ ఎన్టీఆర్ కీర్తి పురస్కారాల పంపిణీ వేడుక శనివారం విజయవాడలో నిర్వహించారు. డాక్టర్ ఎన్టీఆర్ విగ్రహంతో పాటు ప్రతి ఏడాది జయంతి, వర్ధంతిలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్టీఆర్ అభిమానిగా గుర్తింపు పొందిన రాజేష్ చౌదరిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డును శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా సత్కరించి ఎన్టీఆర్ కీర్తి పురస్కారం జ్ఞాపికను రాజేష్ కు అందజేశారు. ఎన్టీఆర్ కీర్తి పురస్కారం అందుకున్న రెడ్డి రాజేష్ ను గుమ్మిలేరు కాకతీయ యూత్ నాయకులు గుణ్ణం శ్రీనివాస్, రెడ్డి సత్తిబాబు, రెడ్డి రుద్రయ్య చౌదరి, యాదగిని సతీష్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు అభినందించారు.
