ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇస్తామన్నా నిరుద్యోగ భృతి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఈనెల 12 న యువత పోరు పేరుతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.4400 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే దానిని ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచించడం అన్యాయమన్నారు. వెంటనే మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కొత్త పెన్షనలు ఇవ్వకపోగా పాత పెన్షన్లు తొలగించే పని జరుగుతోందన్నారు. ఇచ్చిన హామీలు,ఆరు గ్యారెంటీ లు అమలు చేయకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. ఈనేపథ్యంలో తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులు, యువత జయప్రదం చేఆయలనికోరారు. అదేరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం యువత పోరు గోడ పత్రికను విడుదల చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు సూర్యనారాయణ రాజు, నెక్కలనాయుడు బాబు, జైహింద్కుమార్, బంగారునాయుడు, నరసింహమూర్తి, యువజన ,విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.
