విజయవాడ : విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఆపాలని, ఆదాని, యాక్సిస్ తదితర బడా కంపెనీలతో అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని కోరుతూ నేడు విజయవాడ లెనిన్ సెంటర్ లో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాభేరి కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ జరిపారు. వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. విద్యుత్ భారాలపై తీవ్ర నిరసన తెలిపారు. విజయవాడ నగరంలో గత మూడు రోజుల నుండి లక్షలాదిమంది ప్రజల సంతకాలు సిపిఎం కార్యకర్తలు సేకరిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు, స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని ఇంటింటికి స్టిక్కర్ల అంటిస్తున్నారు. ఈనెల 7వ తేదీన విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌదా వద్ద నిరసనకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా బాబురావు, కాశీనాథ్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ దోపిడీని తీవ్రతరం చేశాయి. కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాలు పెంచబోమని హామీ ఇచ్చి మాట తప్పింది. నమ్మకద్రోహం చేసింది. నాలుగు రకాల సర్దుబాటు చార్జీలు.. ప్రతి ఒక్కరి నుండి వసూలు చేస్తూ 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది. వైసీపీ ప్రభుత్వ బాదుడు ఆపుతామని హామీ ఇచ్చి నేడు కూటమి ఉమ్మడి బాదుడు తీవ్రతరం చేసింది. భవిష్యత్తులో మరిన్ని భారాలు మోపటానికి ఒప్పందాలు చేస్తున్నది. అదానీ సంస్థతో సెకి ద్వారా 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకుని గత రాష్ట్ర ప్రభుత్వం 25 సంవత్సరాల పాటు సోలార్ విద్యుత్ సరఫరా చేసే ఒప్పందాన్ని ఆమోదించింది. లక్షా 20 వేల కోట్ల రూపాయల భారం మోపే ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు ఆ ఒప్పందాన్ని కొనసాగించడం మోసపూరితం. వైసీపీ ప్రభుత్వ అవినీతిని కూటమి ప్రభుత్వం రక్షిస్తోంది, కార్పొరేట్ల అవినీతిలో భాగస్వామి అయింది. మోడీ ఆదేశాలతో గతంలో వైసిపి, నేడు టిడిపి, జనసేనలు అదానికి లొంగిపోయి రాష్ట్ర ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. రూ.2.49 పైసలకు సోలార్ విద్యుత్ కొనే ఒప్పందం అధిక భారం అని చెప్పిన తెలుగుదేశం నేడు యాక్సిస్ సంస్థతో యూనిట్ రూ.4.60 పైసలు చెల్లించే ఒప్పందానికి ఆమోదముద్ర వేయటం శోచనీయం. 25 సంవత్సరాల పాటు సోలార్ విద్యుత్ రేటు తగ్గినప్పటికీ, రూ. 4.60 పైసలు చెల్లించే రీతిలో ఒప్పందం చేసుకోవడం దారుణం. సమ్మిళిత విద్యుత్ పేరుతో పాలకులు మోసానికి పాల్పడుతున్నారు. ఈ ఒప్పందం వల్ల 14 వేల కోట్ల రూపాయలు అదనపు భారం జనం పై పడుతుంది. ఆదాని, హిందూజా, యాక్సిస్ తదితర బడా సంస్థలతో అడ్డగోలు ఒప్పందాలు చేసుకొని పాలకులు భారీ అవినీతికి పాల్పడ్డారు. కాసులకు కక్కుర్తి పడి యాక్సిస్ సంస్థతో ఒప్పందాలు చేసుకోవట గర్హనీయం. అక్రమ ఒప్పందాల వల్లనే సాధారణ ప్రజలపై విద్యుత్ భారాలు పడుతున్నాయి. ప్రతినెల, ప్రతి కుటుంబం నుండి వందల, వేలాది రూపాయలు విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తూ బడా కంపెనీల జేబులు నింపుతున్నారు. పాలక పార్టీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో ముద్దాయిలు ఈ అవినీతి ఒప్పందాల కొరకు విద్యుత్ పంపిణీ సంస్థల్లో అవినీతి అధికారులకు కూటమి ప్రభుత్వం అందలాలెక్కిస్తున్నది. కార్పొరేట్లు, పాలకులు, ఉన్నతాధికారులు కుమ్మక్కై విద్యుత్ పేరుతో రాష్ట్ర ప్రజలను దండుకు తింటున్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో భారీ కుంభకోణానికి తెర తీశారు. మోడీ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి గత వైసిపి ప్రభుత్వం అదానీ సంస్థ నుండి స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ నేడు అదే స్మార్ట్ మీటర్లను ఇంటింటికి బిగించడం వంచన కాదా? అని ప్రశ్నించారు. ప్రీపెయిడ్ మీటర్లు ప్రమాదకరం, గంట, గంటకు రేట్లు నిర్ణయించే విధానం ప్రజా వ్యతిరేకం, ప్రతి ఇంటి నుండి వాయిదాల పద్ధతిలో స్మార్ట్ మీటర్ కు అయ్యే 12 వేల రూపాయలు వసూలు చేసి ప్రజల నెత్తిన దీర్ఘ కాలిక భారం మోపుతున్నారు. బిజెపి, తెలుగుదేశం, జనసేన, వైసిపి అందరూ అదానీ, షిర్డీ సాయి తదితర కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కయ్యాయి. అధికార, ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారు, కేంద్రానికి దాసోహం అంటున్నారు. ఈ స్మార్ట్ మీటర్లను ప్రజలు అడ్డుకోవాలి, గతంలో టిడిపి నేతలు పిలుపునిచ్చి నేడు మార్చినా స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టడానికి ప్రజలే సిద్ధమవుతారు. సిపిఎం విజయవాడ నగరంలో ప్రజాభేరి కార్యక్రమంలో భాగంగా లక్షలాది సంతకాలు సేకరిస్తున్నది. ఏడో తేదీన విద్యుత్ సౌదా వద్ద ఉదయం 10 గంటలకు నిరసన చేపట్టింది. ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలి. భవిష్యత్తులో జరిగే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలో కలిసి రావాలి బాబూరావు, కాశీనాథ్ పిలుపునిచ్చారు. విజయవాడ లెనిన్ సెంటర్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్ తదితర నేతలు సంతకాలు సేకరించారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కే.దుర్గారావు, వై సుబ్బారావు, ఝాన్సీ, లక్ష్మణ, కొండ, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
