అల్లాడిపోతున్న ఆదివాసీలు
సిపిఎం,ప్రజాసంఘాల నిరసనలతోస్పందించిన కొత్తకోట పిహెచ్సి అధికారులు
గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు
ప్రజాశక్తి-కొత్తకోట : రావికమతం మండలం చీమలపాడు శివారు నేరేడు బంద గ్రామంలో ఆదివాసీలు జ్వరాలతో అల్లాడిపోతున్నారని తక్షణమే ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సిపిఎం, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. వెంటనే స్పందించిన కొత్తకోట పిహెచ్ సి. వైద్యాధికారిణి రజని ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యాధికారిణి రజని మాట్లాడుతూ గ్రామంలో 11 ఇళ్లలో 56 మంది జనాభా కలిగి ఉన్నారని అందులో ఇద్దరికి సాధారణ జ్వరం కాగా ముగ్గురు వ్యక్తులకు దగ్గు, జలుబు, ఉన్నాయని, 37 మందికి కీళ్ల నొప్పులు, నీరసంతో ఉన్నటు గుర్తించామన్నారు. 12 మంది గర్భిణులకు పలు రకాల మందులు అందజేశారు. జ్వరాలతో బాధపడుతున్న 12 మందికి మలేరియా నిర్ధారణకు రక్త పరీక్షలు చేశామని తెలిపారు.కార్యక్రమం లో ఆరోగ్య విస్తరనాధికారి పి రామారావు, హెచ్ ఎస్ రమణ, ఏ ఎన్ ఎం కృష్ణ వేణి, ఉషారాణి, పలువురు ఆశా కార్య కర్తలు పాల్గొన్నారు.రికార్డుల్లో లేని నేరేడుబంద గ్రామంనేరేడుబంద గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. గోవిందరావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాంగి చంద్రయ్య, గెమిలి వాసు తదితరులు డిమాండ్ చేశారు. గురువారం కొత్తకోటలో విలేకరుల తో మాట్లాడుతూ గ్రామంలో 13 మంది చిన్న పిల్లలు జ్వరాలతో బాధపడుతుండగా, కిల్లో ప్రభాస్ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందుతు న్నారన్నారు. ప్రభుత్వ రెవెన్యూ రికార్డులలో ఈ గ్రామం పేరు లేకపోవడంతో మలేరియా నివారణకు స్ప్రేయింగ్, సరైన ఆరోగ్య సేవలు అందడం లేదన్నారు. గ్రామంలో అంగన్వాడీ, పాఠశాల, ఆశా కార్యకర్తలు లేరని వాపోయారు. సీజనల్లో జ్వరాలు విజృంభిస్తే డోలిమోతలతో మూడుకిలోమీటర్లు తీసుకొస్తేగానీ వైద్యం అందని పరిస్థితి ఉందని, దీనిపై కలెక్టర్ స్పందించాలని కోరారు.