ముమ్మరంగా పోలీసు తనిఖీలు

May 9,2025 20:56

ప్రజాశక్తి-విజయనగరంకోట : భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో దేశ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యమైన ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, లాడ్జీలు, హోటళ్లు, వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లోను, ముఖ్య కూడళ్ళులోను ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టామన్నారు. అనుమానస్పద వ్యక్తులు, ఇతర దేశాల నుండి జిల్లాకు విచ్చేసి, మకాం వేసిన విదేశీ వ్యక్తుల ఆచూకీ కనుగొనేందుకు ఆకస్మికంగా లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలను ముమ్మరం చేసి, అనుమానస్పద వ్యక్తుల వేలిముద్రలను చెక్‌ చేసి, వారి గుర్తింపు కార్డులను పరిశీలించారన్నారు. వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా 1088 వాహనాలను తనిఖీ చేసి, వాహనాల రికార్డులను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పది వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. అనుమానస్పద వ్యక్తులు, షిప్పుల సమాచారాన్ని స్థానిక పోలీసులకు లేదా మెరైన్‌ పోలీసులకు అందించాలని మత్స్యకారులను కోరారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీలను విజయనగరం డిఎస్‌పి ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్‌పి జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్‌పి ఎస్‌.రాఘవులు పర్యవేక్షించగా, తనిఖీల్లో సంబంధిత సిఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, ఎస్టీఎఫ్‌ సిబ్బంది, మెరైన్‌ పోలీసులు, డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్స్‌, డ్రోన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️