ప్రజాశక్తి- విజయనగరంకోట : ఆత్మహత్యాయత్నంకు పాల్పడతానని సూసైడ్ నోట్ రాసిన కేరళ యువకుడు విష్ణు కొయిత్తా పత్తాయా వెస్లీ (21) ఆచూకీని మంగళవారం రాత్రి 9గంటల సమయంలో విజయనగరంలో గుర్తించి, యువకుడికి వన్టౌన్ పోలీసులు కాపాడారు. ఎస్పి వకుల్ జిందాల్ తెలిపిన వివరాలు ప్రకారం..విష్ణు కొయిత్తా పత్తాయా వెట్లీ బిఎస్సి నర్సింగు చదువుకొని, కర్నాటక రాష్ట్రం బెంగుళూరులో ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక యువతితో పరిచయం ఏర్పడి, ఆమెను గాఢంగా ప్రేమించాడు. కాలక్రమంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తడంతో, యువకుడి ఫోను నంబరును సదరు యువతి బ్లాక్ చేయడంతో, మనస్తాపం చెందాడు. ఈ ఘటన నుంచి సదరు యువకుడు బయటపడలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, తన డెడ్ బాడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో ట్రేస్ చేసుకోవచ్చుని సూసైడ్ లెటరు రాసి, సోషల్ మీడియాలో పోస్టు చేసాడు. ఈ పోస్టుతో అప్రమత్తమైన సదరు యువకుని బంధువులు, స్నేహితులు సదరు విషయాన్ని ఎస్పి దృష్టికి ఫోన్లో తెలిపారు. యువకుడి ఆచూకీ కనిపెట్టి, రక్షించే చర్యలు చేపట్టాలని వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ను ఎస్పి ఆదేశించారు. యువకుడి ఆచూకీ కనిపెట్టేందుకు రంగంలో దిగిన వన్ టౌన్ పోలీసులు సాంకేతికతను వినియోగించి విశాఖపట్నం, చీపురుపల్లి, విజయనగరం పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో గాలించి, చివరికి యువకుడి ఆచూకీని విజయనగరం రైల్వే స్టేషనులో మార్చి 11న రాత్రి కనుగొన్నారు. యువకుడ్ని విజయనగరం 1టౌన్ స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సిలింగు నిర్వహించి, వారి బంధువులకు సమాచారం అందించారు.యువకుడి బంధువులు గురువారం రావడంతో డిఎస్పి శ్రీనివాసరావు సమక్షంలో అప్పగించారు. జీవితం చాలా విలువైనదని, జీవితంలో ఏర్పడిన స్వల్ప వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు సరికాదని, ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకొని, లక్ష్య సాధనకు కషి చేయాలని పోలీసులు యువకుడు విష్ణు కెపికి హితబోధ చేశారు.సకాలంలో స్పందించి, యువకుడి ఆచూకీ కనిపెట్టి, ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ను, సిబ్బందిని డిఎస్పితో పాటు ఎస్పి అభినందించారు.
